గిరిజన మహిళలకు 118 ఎకరాలు

118 Acres Land For Tribal Women - Sakshi

రూ.6.67 కోట్లతో కొనుగోలుకు చర్యలు

‘వైఎస్సార్‌ జలకళ’ కింద ఉచితంగా బోరు, మోటారు 

సాక్షి, అమరావతి: గిరిజన మహిళలకు భూమి కొనుగోలు పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఒక్కొక్కరికి రెండెకరాల వరకు మాగాణి, ఐదెకరాల వరకు మెట్ట భూముల్ని ఈ పథకం కింద కొనుగోలు చేసి ఇస్తారు. రూ.6.67 కోట్లతో సాగుకు అనువైన 118 ఎకరాలు కొని 57 మంది గిరిజన మహిళలకు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం కింద రైతులకు ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన 25 శాతాన్ని బ్యాంకుల ద్వారా రుణంగా ఇప్పిస్తుంది. ఒక్కో రైతుకు రూ.15 లక్షల వరకు యూనిట్‌ ఖరీదుగా ప్రభుత్వం నిర్ణయించింది.

పంపిణీ అనంతరం నీటిపారుదల వసతి లేని భూముల్లో.. భూగర్భ జలాలను పరిశీలించి వైఎస్సార్‌ జలకళ పథకం కింద బోరు వేయించి మోటారు కూడా బిగించి ఇస్తుంది. గిరిజన రైతుల కోసం ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా ఇప్పటికే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ట్రైకార్‌ స్పెషల్‌ ప్రాజెక్టుల్లో భాగంగా 23,923 మందికి రూ.11.73 కోట్లతో పెద్ద ట్రాక్టర్లు, స్ప్రింక్లర్లు, టార్పాలిన్లు, బోర్లు, సబ్‌ మెర్సిబుల్‌ మోటార్లను అందించింది. గిరిజన రైతులకు వ్యవసాయం కోసం ఎటువంటి సాయం కావాలన్నా అందించేందుకు ట్రైకార్‌ సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం వ్యవసాయానికి పెద్ద పీట వేయడంతోపాటు రైతుకు కావాల్సిన సౌకర్యాలు సమకూర్చడంలో ముందంజలో ఉంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top