స్టేషన్‌ వద్దకు వచ్చి ఫోన్‌ చెయ్‌.. | - | Sakshi
Sakshi News home page

స్టేషన్‌ వద్దకు వచ్చి ఫోన్‌ చెయ్‌..

Apr 22 2026 7:36 AM | Updated on Apr 22 2026 7:36 AM

ముఠా సభ్యుల మధ్య విభేదాలు వచ్చి గొడవలు చేసుకున్న సందర్భంలో హెడ్‌ కానిస్టేబుల్‌ ఒకరు ఓ సభ్యురాలికి ఫోన్‌ చేసి మాట్లాడాడు. ‘మీరు మీరు ఎందుకు కొట్లాడుకుంటారు. నేను ఎస్పీని కలిసి అన్ని విషయాలూ చెబుతానని సదరు మహిళ అంటే... వద్దువద్దు నేను మాట్లాడతా. రెండు రోజులు సైలెంటుగా ఉండు.. ఆమె నీ జోలికి రాకుండా నేను మాట్లాడతా. రేపు ఉదయం మీరు స్టేషన్‌ వద్దకు రండి. ఫోన్‌ చేస్తే నేను బయటకు వస్తా. ఆలోపు మీరు వారిని తడుముకోవద్దు. నువ్వు బంగారు బాతువు. నువ్వు ఆమెతో విభేదిస్తే వ్యాపారం జరగదని భావించి ఈరకంగా గొడవ చేసి ఉంటుంది. నాకూ చాలా డబ్బు ఇచ్చినామని చెప్పిండొచ్చు. ఆడపిల్లల సొమ్ము... ఎంత ఇచ్చినా తీసుకున్నాను తప్ప ఇంతేకావాలని నేను అడగలేదు’ అని మాట్లాడిన ఆడియోలు వైరల్‌ అవుతున్నాయి.

చాలా తెలివైనోడు...జాగ్రత్త!

ఓ కానిస్టేబుల్‌ ముఠా సభ్యురాలితో ఫోన్‌లో మాట్లాడిన తీరును పరిశీలిస్తే ట్రాప్‌కు పూర్తిగా సహకరించినట్లు స్పష్టమవుతోంది. ‘వాడు చాలా తెలివైనోడు. చాలా జాగ్రత్తగా డీల్‌ చేయాలని టీం లీడర్‌కు చెప్పా. ట్రాప్‌ చేసే మహిళ అతడి కారులో వెళ్తుంటే వెనుక మరోబైకును ఎందుకు ఫాలో అవ్వమని చెప్పింది..? ఓపెన్‌ ప్లేస్‌లోకి వెళ్లాక వెనుక బైకు వస్తుంటే కారులో ఉన్న వ్యక్తికి ఎందుకు అనుమానం రాదు..? ఆయన విషయంలో అదే జరిగింది. అనుమానం వచ్చి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఏదో మోసం జరుగుతోందని గ్రహించి ఆ ఏరియా వారిని కనుక్కున్నాడు. విషయమంతా తెలిసిపోయింది. ఆమె ఇదే పని చేస్తోందని అతడికి ఎవరో చెప్పారంట. అతను నా వద్దకు వచ్చి అదే విషయాన్ని చెప్పాడు. అనుమానం వచ్చి నీ నంబరు బ్లాక్‌లో పెట్టాడు. జాగ్రత్తగా డీల్‌ చేయాలి కదా’ అంటూ సంభాషించాడు.

రాప్తాడు రూరల్‌: రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న ‘నయా హనీ ట్రాప్‌’ దందా ఊహించని మలుపు తిరుగుతోంది. ప్రజలను కాపాడాల్సిన పోలీసులే ఈ దందాలో భాగస్వాములయ్యారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారాన్ని జిల్లా పోలీస్‌ బాస్‌ (ఎస్పీ) జగదీష్‌ సీరియస్‌గా పరిగణించారు. అనంతపురం రూరల్‌ పరిధిలో వెలుగుచూసిన ఈ హనీట్రాప్‌ ముఠా... ఆర్థికంగా బలమైన ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, వ్యాపారులను లక్ష్యం చేసుకుని వలపు వల విసిరి నిలువు దోపిడీ చేసింది.

ముఠా తీరు భయంకరం

హనీ ట్రాప్‌లో చిక్కుకున్న వారి పట్ల ముఠా సభ్యులు వ్యవహరించే తీరు అత్యత భయంకరంగా ఉంటోందని బాధితులు వాపోతున్నారు. ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించి, ప్రజలను అప్రమత్తం, అవగాహన కల్పించాల్సిన పోలీసులే వారికి సహకరించడం దుమారం రేపుతోంది. పలువురు పోలీసులు తమకు ‘టచ్‌’లో ఉన్నారనే ధైర్యంతోనే ముఠా బరితెగించినట్లు స్పష్టమవుతోంది. ట్రాప్‌లో పడిన వ్యక్తులు తిరగబడే పరిస్థితి ఉంటే తమకు అనుకూలంగా ఉన్న పోలీసులను రంగంలోకి దింపుతారు. పోలీసు డ్రెస్‌లో ఉన్నవారు అక్కడికి చేరుకోగానే సదరు వ్యక్తి హడలిపోవడం పరిపాటి. ‘మహిళను ఇబ్బంది పెట్టావు. ఆమె బలత్కారం కేసు పెడితే కచ్చితంగా జైలుకు వెళతావు’ అంటూ బాధితులను బెదిరించే ధోరణిలో మాట్లాడినట్లు సమాచారం. ఇప్పటిదాకా జిల్లాలో హనీట్రాప్‌ బాధితుల సంఖ్య వందల్లో ఉన్నట్లు తెలిసింది.

మలుపు తప్పిన అంతర్గత విభేదాలు

ఇటీవల కొందరు బాధితులు నేరుగా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడంతో హనీట్రాప్‌ దందా వెలుగులోకి వచ్చింది. మరోవైపు హనీట్రాప్‌ ముఠా సభ్యుల్లో అంతర్గత విభేదాలు బయటపడడం కేసును కొత్త మలుపు తిప్పింది. వెంటనే స్పందించిన ఎస్పీ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపి గుట్టు రట్టు చేసేదిశగా దర్యాప్తు వేగవంతం చేశారు. హనీట్రాప్‌ బాధితులు తమకు న్యాయం చేయాలని ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా మంగళవారం అనంతపురం త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

పోలీసుల పాత్రపై ఎస్పీ సీరియస్‌

మరోవైపు ఓ హెడ్‌ కానిస్టేబుల్‌, మరో కానిస్టేబుల్‌ ముఠా సభ్యులతో మాట్లాడిన సంభాషణ పోలీసు విభాగంలో చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం పట్ల ఎస్పీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సహకరించిన ఏ స్థాయి వారినీ ఉపేక్షించ కూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. నివేదిక రాగానే బాధ్యులైన సిబ్బందిపై వేటు వేస్తారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనంతపురం సమీపంలో ఉన్న ఓ ఎస్‌హెచ్‌ఓ కూడా ముఠాకు అన్ని విధాలా సహకరించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాదు పోలీసు శాఖలో ఓ ఉన్నతాధికారి అండదండలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ ఎస్పీ దృషికి వచ్చినట్లు సమాచారం.

ఆర్ట్స్‌ కళాశాల డిగ్రీ మొదటి సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

అనంతపురం ఎడ్యుకేషన్‌: అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల డిగ్రీ మొదటి సంవత్సరం ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. ప్రిన్సిపాల్‌ చాంబర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్కే యూనివర్సిటీ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఆచార్య రమణ, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ శ్రీరామ్‌ నాయక్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.పద్మశ్రీ, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ తిరుమలేష్‌ చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలకు మొత్తం 1,447 మంది విద్యార్థులు హాజరు కాగా 672 మంది (46.44 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బీఏలో 33 శాతం, బీకాంలో 54 శాతం, బీఎస్సీలో 48 శాతం, బీబీఏలో 40 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలు నిర్వహించిన రెండు నెలల్లోపు ఫలితాలను విడుదల చేయడం సంతోషకరమని ఎస్కే యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement