అనంతపురం ఎడ్యుకేషన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యను ప్రైవేటీకరణ, కాషాయీకరణ చేయాలనే ప్రయత్నాల నుంచి కాపా డాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ నాల్గో ఎస్ఎఫ్ఐ మహాసభను ఆదివారం సీపీఎం కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ గేయానంద్, ప్రసన్నకుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యను బలహీనపరుస్తూ, సెంట్రల్ యూనివర్సిటీలకు తగిన బడ్జెట్ కేటాయించకుండా నిధులను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. సెంట్రల్ యూనివర్సిటీలలో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సరైన సౌకర్యాలు లేకుండా విద్యాభ్యాసం కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కామన్ పీజీ సెట్ విధానం ద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నారని పేర్కొన్నారని వాపోయారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతూరు పరమేష్, జిల్లా అధ్యక్షుడు గిరి, నగర నాయకులు శివ, భీమేష్, సెంట్రల్ యూనివర్సిటీ కమిటీ అధ్యక్షురాలు అన్నన్, ఎస్కే యూనివర్సిటీ కార్యదర్శి శాంతిరాజ్, నాయకులు పవన్, నాగేంద్ర పాల్గొన్నారు.


