రాప్తాడురూరల్:భవన నిర్మా ణ కార్మికుడిని నకిలీ అధికారి బురిడీ కొట్టించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు...ఆత్మకూరు మండలం బి.యాలేరుకు చెందిన మోపూరు వెంకటరాముడు భవన నిర్మాణ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. హంపాపురంలో పేమెంట్ రూ.30 వేలు రావాల్సి ఉండ గా, ఆదివారం అక్కడికి వెళ్లి యజమానిని కలిశాడు. అతను సోమవారం పేమెంట్ చేస్తానని, తన వద్దనున్న రూ.20 వేలు అనంతపురంలో సిమెంట్ యజమానికి ఇవ్వాలని వెంకటరాముడుకు ఇచ్చి పంపాడు. ఈ డబ్బు తీసుకొని వెంకటరాముడు బైక్పై బయల్దేరాడు. హంపాపురం క్రాస్ దాటిన తర్వాత గోడౌన్ సమీపంలో రోడ్డుపక్కన కారు, ద్విచక్ర వాహనం ఆగి ఉన్నాయి. వెంకటరాముడు అక్కడికి చేరుకోగానే బైకుపై ఉన్న యువకుడు బండిని ఆపి ‘తాము చెకింగ్ అధికారులు’ అని చెప్పా రు. ముందుగా బ్యాగ్ పరిశీలించి, జేబుల్లోని డబ్బు చూపించాలన్నారు. తన వద్దనున్న రూ.20 వేలు ఆ వ్యక్తి డబ్బును తీసుకుని లెక్కపెట్టాడు. అనుమానం వచ్చిన వెంకటరాముడు అతన్ని ప్రశ్నించగా, ‘మా సార్ చెప్పినట్టు చెక్ చేస్తున్నాం’ అని చెప్పాడు. డబ్బు తిరిగి ఇస్తున్నట్లు ఇస్తూ అక్కడి నుంచి బెక్పై రాంగ్ రూట్లో హంపాపురం వైపు ఉడాయించాడు. మోసపోయినట్లు విషయం గ్రహించిన వెంకటరాముడు వెంటనే అతన్ని వెంబడించినా ఫలితంలేకపోయింది. తిరిగి ఘటన స్థలానికి వచ్చేసరికి అక్కడా కారు లేదు. బాధితుడు రాప్తాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.


