లేపాక్షి: ద్విచక్ర వాహనంపై నుంచి అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ ఉపాధ్యాయురాలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు... నల్లచెరువుకు చెందిన పి.సుభాన్బీ (39)కు భర్త ముస్తాఫా, ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన ఓ కుమార్తె ఉన్నారు. హిందూపురంలోని నందమూరినగర్లో నివాసముంటూ లేపాక్షిలోని కేజీబీవీలో ఆంగ్ల ఉపాధ్యాయురాలు (సీఆర్టీ) గా సుభాన్బీ పనిచేస్తున్నారు. శుక్రవారం ఉదయం తన భర్త ముస్తాఫాతో కలసి ద్విచక్ర వాహనంపై కేజీబీవీకు బయలుదేరారు. మార్గమధ్యంలో చోళసముద్రం సమీపంలోని టోల్ప్లాజా వద్ద స్పీడ్ బ్రేకర్లు దాటే సమయంలో అదుపు తప్పి ఇద్దరూ కిందపడ్డారు. సుభాన్బీ వెల్లకిలా పడడంతో తలకు బలమైన గాయమై వెంటనే అపస్మారక స్థితికి చేరుకున్నారు. గమనించిన స్థానికులు వెంటనే హిందూపురంలోని జిల్లాస్పత్రికి తరలించారు. సుభాన్బీ పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఘటనపై లేపాక్షి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, సుభాన్బీ మృతిపై లేపాక్షి కేజీబీవీ ఎస్ఓ నీలిమా, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


