ఉరవకొండ: మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో తాగునీటి కష్టాలు తారస్థాయికి చేరాయి. గుక్కెడు నీటి కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఉరవకొండ పట్టణంలోనే 15 రోజులుగా తాగునీరు సరఫరా కాలేదంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో స్థానికులు చేతి పంపులు, నీటి ట్యాంకుల వద్ద మండుటెండలో గంటల తరబడి నిరీక్షించి నీళ్లు తెచ్చుకుంటున్నారు. 50 వేల జనాభా ఉన్న ఉరవకొండ పట్టణానికి పీఏబీఆర్ నుంచి ప్రత్యేక లైన్ ద్వారా తాగునీరు సరఫరా అవుతుంది. అయితే, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల ప్రణాళిక లేమి, తరచూ పైప్లైన్ మరమ్మతులు, కరెంట్ సమస్య వెరసి 15 రోజులుగా పట్టణానికి తాగు నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించి తాగునీరు సరఫరా అయ్యేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
ఉరవకొండలో సైకిల్పై నీటిని తెచ్చుకుంటున్న స్థానికులు, చిన్నకొండ వద్ద మరమ్మతుకు నోచుకోని నీటి ట్యాంకు
మంత్రి పయ్యావుల
నియోజకవర్గంలో
తారస్థాయికి తాగునీటి సమస్య
ఉరవకొండలో 15 రోజులైనా సరఫరా కాని తాగునీరు
నీరిలా.. తాగేదెలా..?
విడపనకల్లు: మండల పరిధిలోని హావళిగి గ్రామంలో సరఫరా అవుతున్న తాగునీరు రంగు మారి, దుర్గంధం వెదజల్లుతోంది. మంత్రి కేశవ్ ఇలాకాలోని గ్రామంలో నెలకొన్న ఈ దుస్థితి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆరు నెలలుగా అవస్థలు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజ్ నీటి కంటే అధ్వానంగా నీరు ఉన్నాయంటూ వాపోతున్నారు. గత్యంతరం లేక ఆ నీటినే తాగిన పలువురు వాంతులు, విరేచనాలు కావడంతో ఆస్పత్రుల పాలైనట్లు తెలిసింది. విషయాన్ని అనేక సార్లు అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ అయినా స్పందించి, మంచి నీరు సరఫరా అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


