● వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి
● రెడ్బుక్ రాజ్యాంగం అమలులో భాగమేనంటూ మండిపాటు
అనంతపురం: భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏకంగా దళిత మహిళానేతను దుర్భాషలాడిన మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తక్షణమే క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉంటూ ఓ దళిత మహిళను బూతులతో దూషించడం ఎంఎస్ రాజు దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. అవమానం తట్టుకోలేక వైఎస్సార్సీపీ దళిత మహిళా నేత, ఆర్టీసీ జోనల్ మాజీ చైర్పర్సన్ మాల్యవంతం మంజుల బహిరంగంగానే బిగ్గరగా ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయారని గుర్తు చేశారు. మంజులను దుర్భాషలాడడమే కాక, తిరిగి ఆమైపెనే ఐ–టీడీపీ బ్యాచ్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎంఎస్ రాజు మాట్లాడిన బూతులు సభ్య సమాజం తలదించుకునే రీతిలో ఉన్నాయన్నారు. ఈ అంశాలన్నింటిపై సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రెడ్బుక్ రాజ్యాంగం అమలులో భాగంగానే మహిళలపై అత్యాచారాలు, హత్యలు, ఆకృత్యాలు అధికమయ్యాయని మండిపడ్డారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషిస్తే.. ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేని అసమర్థ స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని విమర్శించారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షురాలు సాకే చంద్రలేఖ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీరు రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు నిదర్శనమన్నారు. జెడ్పీ వైస్చైర్మెన్ నాగరత్నమ్మ మాట్లాడుతూ.. దళిత మహిళా నేత మంజులను దుర్భాషలాడిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తక్షణమే క్షమాపణలు చెప్పాలన్నారు. ఇప్పటికై నా బుద్ధి తెచ్చుకోకపోతే.. మహిళల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి దేశాయి భారతీరెడ్డి, నాయకులు శోభారాణి, భారతి, ఖమర్తాజ్, శోభాబాయి, ఉషారాణి, అంజలి తదితరులు పాల్గొన్నారు.


