● వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి
ఉరవకొండ: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీపీఆర్వో, పార్టీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని ఆ పార్టీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ఈ అరెస్ట్ను ఖండిస్తూ వజ్రకరూరు మండలం జరుట్ల రాంపురంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పూడి శ్రీహరిని అతని ఇంట్లోనే కుటుంబ సభ్యులంతా భయాందోళనకు గురైయ్యేలా అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో ఎన్నో దుర్మార్గాలకు చంద్రబాబు, లోకేష్, పవన్కుమార్ పాల్పడుతున్నారన్నారు. అయితే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఇలాంటి రెడ్బుక్లకు భయపడకుండా చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, దుర్మార్గలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారన్నారు. ఈ పోరాటంలో దూసుకెళుతున్న శ్రీహరిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఇంతటి దుర్మార్గానికి పాల్పడిందన్నారు. సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా చిన్న పోస్టు పెట్టారనే సాకు చూపి అరెస్ట్ చేయడం సరైంది కాదన్నారు. ఈ అరెస్ట్ ద్వారా సోషల్ మీడియాను అణగదొక్కాలనుకోవడం ప్రభుత్వ అవివేకానికి నిదర్శనమన్నారు. ఇప్పటికై నా పోలీసులు వెంటనే శ్రీహరిని బేషరుతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికారప్రతినిధి సీపీ వీరన్న, ఉస్మాన్, డిష్ సురేష్, కౌడిగి గోవిందు, సిద్దు, జగదీష్, తదితరులు పాల్గొన్నారు.


