గుమ్మఘట్ట (రాయదుర్గం రూరల్): ఈ నెల 19 నుంచి 20వ తేదీ వరకు నెల్లూరులోని అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వేదికగా జరిగే రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు రాయదుర్గంలోని కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ బుధవారం వెల్లడించారు. ఎంపికై న వారిలో ఎస్ఎండీ అలీ, ఎస్.సమీర్, ఖాజాపీరా, వెంకటసాయి, హర్షవర్దన్ ఉన్నారు. వీరిని కళాశాల అధ్యాపకులు బుధవారం అభినందించారు.
యువతి ఆత్మహత్యాయత్నం
అనంతపురం సెంట్రల్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు తెలిపిన మేరకు... ఉరవకొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి అనంతపురంలోని అరవిందనగర్లో ఉన్న బీసీ హాస్టల్ ఉంటూ ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో అనస్తియా టెక్నీషియన్ కోర్సు ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బుధవారం హాస్టల్ గదిలో అపస్మారక స్థితిలో పడి ఉండడం గమనించిన తోటి విద్యార్థుల సమాచారంతో వెంటనే ఆమెను సర్వజనాస్పత్రికి హాస్టల్ సిబ్బంది తరలించింది. కాగా, సదరు యువతి తన మేనత్త కుమారుడిని ప్రేమించి ఇరు కుటుంబాలకు తెలియకుండా పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న రెండు కుటుంబాల మధ్య గొడవలు చోటు చేసుకోవడంతో మనస్తాపం చెంది విషపూరిత ద్రావకం తాగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు రెండో పట్టణ సీఐ శ్రీకాంత్ యాదవ్ తెలిపారు.


