అనంతపురం టౌన్: ప్రభుత్వ ఖజానాకు అత్యధికంగా ఆదాయం సమకూర్చే శాఖల్లో ప్రధానమైన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సొంత భవనాలు లేవు. ఏడాదికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.500కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా సమకూరుతోంది. అయినా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించే యోచన ప్రభుత్వం చేయడం లేదు.
8 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
ప్రైవేట్ భవనాల్లోనే
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. డీఐజీ కార్యాలయంతోపాటు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు సైతం అద్దె భవనాల్లోనే ఉన్నాయి. అలాగే అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, రామ్నగర్, కళ్యాణదుర్గం, శింగనమల, యాడికి, పామిడి, గుంతకల్లు, కణేకల్లు తదితర ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ ప్రైవేట్ భవనాల్లోనే ఏర్పాటు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో ఉన్న జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు చిలమత్తూరు, ధర్మవరం రిజిస్ట్రేషన్ కార్యాలయాలూ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి.
సొంత భవనాల ఏర్పాటు ఎన్నడో..
ఏడాదికి ప్రభుత్వ ఖజానాకు ఉమ్మడి జిల్లా పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా రూ.500 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. రెవెన్యూ పరంగా బలమైన ఆదాయ వనరుగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలు లేని కొరత ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. కొన్నేళ్లుగా అద్దె భవనాల్లోనే కాలం నెట్టుకొస్తున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించి ఇచ్చే అంశంపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ భవనాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్ భవనాలు సైతం అద్దె భవనాల్లోనే
సొంత భవనాల ఏర్పాటుపై దృష్టి సారించని ప్రభుత్వం
నివేదిక పంపారు
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాల విషయమై ఉన్నతాధికారులకు గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు నివేదికలు పంపారు. సొంత భవనాలు కేటాయిస్తే రిజిస్ట్రేషన్ శాఖపై అద్దె భారం తగ్గుతుంది.
– బి.శ్రీనివాసులు, జిల్లా రిజిస్ట్రార్


