ప్రశాంతినిలయం: సాయికుల్వంత్ సభామంటపంలో రెండో రోజూ తమిళ నూతన సంవత్సర వేడుకలు వైభవంగా సాగాయి. వేడుకల్లో భాగంగా మంగళవారం ప్రముఖ సంగీత విద్వాంసురాలు కీర్తనా భరద్వాజ్ కర్ణాటక సంగీత కచేరీతో భక్తులను మైమరిపించారు. సంప్రదాయ తేవారంతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె శాశ్వతమైన తమిళ భక్తి గీతాలను ఆలపించి ఆకట్టుకున్నారు. అనంతరం బ్రోచేవారెవరురా, మోక్షము కలదా కృతులతో భక్తి భావాన్ని ఆవిష్కరించారు. కీర్తనా భరద్వాజ్ బృందాన్ని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు, ఆయన భార్య హిమవాహిణి ఘనంగా సత్కరించారు.


