● ఇసుక, చెరువు మట్టిని తోడేస్తున్న ‘తమ్ముళ్లు’
● రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నా పట్టని అధికారగణం
పెద్దవడుగూరు : చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అధికార టీడీపీ నాయకులు ఆదాయమే పరమావధిగా సహజ వనరులను కొల్లగొడుతున్నారు. పెన్నా నదీ పరివాహక ప్రాంతాల నుంచి ఇసుకను, చెరువుల్లోంచి సారవంతమైన మట్టిని తోడేసి సొమ్ము చేసుకుంటున్నారు. సహజ వనరులను కాపాడాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. మండలంలోని గుత్తి అనంతపురం, జి.వెంకటాంపల్లి, కొండూరు, చిట్టూరు తదితర ప్రాంతాల నుంచి ఇసుకను రాత్రి వేళల్లో అనంతపురం, పామిడి, గుత్తి, తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. తాజాగా జి.వెంకటాంపల్లి చెరువు మట్టిపై కన్నేశారు. సాధారణంగా బీడుభూములకు, లోతట్టు ప్రాంతాలకు చెరువులోని సారవంతమైన ఒండ్రుమట్టిని రైతులకు అవసరమైనప్పుడు ఉచితంగానే తోలుకోవచ్చు. అయితే ఇక్కడ రైతులు కాకుండా ‘పచ్చ’ నేతలు రంగంలోకి దిగారు. జేసీబీలు పెట్టి చెరువు మట్టిని రాత్రి, పగలు అనే తేడా లేకుండా తవ్వి.. ట్రాక్టర్ల ద్వారా తరలించి రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు.


