అనంతపురం అర్బన్: అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలను చైతన్య పరచాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆదేశించారు. ఈ క్రమంలో మంగళవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లు, బ్రోచర్లను జేసీ ఆవిష్కరించి, మాట్లాడారు. అగ్ని ప్రమాదాల నివారణ పద్దతులను వారోత్సవాల్లో తెలియజేయాలన్నారు. గృహాలు, వంటిల్లు, పాఠశాలలు, వసతి గృహాలు, షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంక్లు, గ్యాస్ గోదాములు, గిడ్డంగులు, కర్మాగారాలు, తదితర ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్య పరచాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఎ.మలోల, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్, పద్మావతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు
అనంతపురం సెంట్రల్: అగ్నిమాపక వారోత్సవాలను మంగళవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన తన చాంబర్లో మీడియాతో మాట్లాడారు. అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే తీసుకోవాల్సిన చర్యలపై వారోత్సవాల్లో ప్రజలను చైతన్య పరచనున్నట్లు తెలిపారు.
అధికారులకు జేసీ విష్ణుచరణ్ ఆదేశం


