దూసుకొచ్చిన మృత్యువు
కళ్యాణదుర్గం రూరల్: వివాహ కార్యక్రమంలో పాల్గొని.. బంధుమిత్రులతో సరదాగా గడిపి తిరుగు పయనమైన వారిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. మలుపు సమీపంలో ఆర్టీసీ బస్సు కారును వేగంగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. మూడు కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చింది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో సంఘటన స్థలం.. ఆస్పత్రి ప్రాంగణం మిన్నంటింది.
బతుకుదెరువు కోసం వలస..
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు నుంచి పలు కుటుంబాలు బతుకుదెరువు కోసం కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు వలస వెళ్లాయి. అలా వెళ్లిన వారిలో రక్తసంబంధీకులైన హనుమంతరాయుడు (40), శివకుమార్ (35), చంద్రకళ (32) కుటుంబాలు ఉన్నాయి. వీరు అక్కడ దోబీ (చాకలి) పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పిల్లలను అక్కడే చదివించుకుంటున్నారు.
దూసుకొచ్చిన మృత్యువు..
కర్ణాటక రాష్ట్రం మొలకాల్మూరులో బంధువుల వివాహం ఉండటంతో హనుమంతరాయుడు, శివకుమార్, చంద్రకళ శనివారం బెంగళూరు నుంచి కారులో వచ్చారు. అక్కడ రాత్రంతా పెళ్లి వేడుకల్లో మునిగితేలారు. ఆదివారం ఉదయం పెళ్లి ముగిశాక భోజనాలు ముగించుకుని తిరుగుపయనమయ్యారు. కళ్యాణదుర్గం ప్రాంతంలోని బంధువులను కలిసివెళ్లాలనుకున్నారు. ఈ మేరకు కారులో బయల్దేరారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లి మలుపు సమీపంలోకి చేరుకోగానే రాయదుర్గం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు (ఏపీ02 జెడ్ 0469) వేగంగా దూసుకొచ్చింది. అదీ కుడివైపునకు ఎక్కువగా వచ్చేయడంతో కారు పక్కకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. దీంతో బస్సు.. కారుమీదకెక్కింది. అంతే డ్రైవింగ్ చేస్తున్న శివకుమార్, వెనక కూర్చున్న హనుమంతరాయుడు, చంద్రకళ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. హనుమంతరాయుడుకు భార్య నాగలక్ష్మి, కొడుకు, కూతురు ఉన్నారు. చంద్రకళకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఇక శివకుమార్ అవివాహితుడు. చంద్రకళ, శివకుమార్ అన్నాచెల్లెలు. వీరి పెద్దనాన్న కుమారుడు హనుమంతరాయుడు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
దేవుడా ఎంత పనిచేశావయ్యా..!
హనుమంతరాయుడు, శివకుమార్, చంద్రకళ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద వార్త తెలుసుకున్న బంధువులు ఆస్పత్రికి చేరుకుని రోదించారు. పెళ్లిలో ఎంతో సంతోషంగా గడిపిన వీరు విగతజీవులుగా మారిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. దేవుడా ఎంత పని చేశావయ్యా అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఒకేసారి ముగ్గురు మరణించడంతో స్వస్థలం ముదిగల్లు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గూబనపల్లి వద్ద రోడ్డు ప్రమాదం
కారులోని ముగ్గురు దుర్మరణం
మృతులందరూ రక్తసంబంధీకులే
దూసుకొచ్చిన మృత్యువు
దూసుకొచ్చిన మృత్యువు
దూసుకొచ్చిన మృత్యువు


