నేడు ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కారవేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్న పరిష్కార వేదికలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. భూసమస్యలపై అర్జీలను రెవెన్యూ క్లినిక్లో తహసీల్దార్లకు అందజేయాలన్నారు. అర్జీ పరిష్కార స్థితిని కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను meeko sam.ap.gov.in వెబ్సైట్ ద్వారా కూడా సమర్పించవచ్చని పేర్కొన్నారు.
నేడు డయల్ యువర్ సీఎండీ
అనంతపురం టౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు 89777 16661 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఫోన్ చేసే వినియోగదారులు తమ విద్యుత్ నంబర్ను తప్పకుండా తెలియజేయాలని సూచించారు.
జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ..
అనంతపురం జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు 91547 90350లో ఫిర్యాదు చేయాలని కోరారు.
మేలుజాతి పశుసంతతి
పెంపుపై దృష్టి
అనంతపురం అగ్రికల్చర్: మేలుజాతి పశు సంతతి పెంపుపై దృష్టి సారించినట్లు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డీఎల్డీఏ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) డాక్టర్ జి.వెంకటేష్ తెలిపారు. లింగనిర్ధారిత వీర్యం (సెక్స్ సార్టెడ్ సెమన్–ఎస్ఎస్ఎస్) పథకం పటిష్టంగా అమలు చేస్తుండటంతో వచ్చే ఏడాది నుంచి వాటి ఫలితాలు వెల్లడికానున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కుప్పం ప్రాంతంలోనే పాడి పశువులు, గేదెలకు ఎస్ఎస్ఎస్ పథకం ద్వారా ఉచితంగా ఎద సూదులు వేస్తున్నట్లు తెలిపారు. ఈ కృత్రిమ గర్భోత్పత్తి కింద ఎదసూదులు వేస్తే 90 శాతం వరకు పెయ్యదూడలు (ఫిమేల్) పుడతాయన్నారు. ఒక సారి వేస్తే ఎద కట్టని పశువులకు రెండోసారి కూడా ఉచితంగా ఇస్తామన్నారు. జిల్లాకు 35 వేల డోసులు ఎస్ఎస్ఎస్ వీర్యం సరఫరా కాగా అందులో 20 వేలకు పైగా డోసులు పశువులు, గేదెలకు వేశామన్నారు. ఇక నుంచి ప్రతి నెలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5 వేల పశువులకు ఎదసూదులు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
రేపు నృసింహాలయం మూత
కదిరి: చంద్రగహణం కారణంగా ఈ నెల 3వ తేదీన మంగళవారంఉదయం 8 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకూ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మూసివేయనున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ వి.శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనం మినహా భక్తులకు ఆ రోజు ఉదయం అల్పాహారంతో పాటు రాత్రి భోజనం అన్నదాన సత్రంలో అందుబాటులో ఉంటుందని చెప్పారు.


