ఇలా అయితే.. ఎలా నేస్తం?
అనంతపురం: ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో అత్యధికం అమలుకు నోచుకోవడం లేదు. చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ అలవికాని హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నది అధికారంలోకి రావడానికి మాత్రమేనని తేలిపోతోంది. లా నేస్తం కింద జూనియర్ న్యాయవాదులకు నెలకు ఇస్తున్న రూ.5 వేలను రూ.10వేలకు పెంచుతామని ఊరూవాడా విస్తృతంగా ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలవుతున్నా పథకం అమలు – స్టైఫండ్ పెంపును విస్మరించి జూనియర్ న్యాయవాదులను వంచనకు గురిచేశారు.
బృహత్తర పథకం
లా కోర్సు పూర్తి చేసి న్యాయవాదిగా నిలదొక్కుకోవాలంటే కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం పడుతుంది. ఈ కాలంలో ఆదాయం లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సీనియర్ న్యాయవాదుల వద్ద జూనియర్గా చేరినా వెంటనే జీతం ఇవ్వరు. అందుకే చాలామంది లా కోర్సు పూర్తయిన వెంటనే ప్రాక్టీసుకు వెళ్లరు. ఈ నేపథ్యంలో న్యాయవాద వృత్తి చేపట్టే వారికి ప్రారంభంలో ఆర్థిక అవరోధాలు ఉండకూడదనే ఉద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘వైఎస్సార్ లా నేస్తం’ పథకం ప్రవేశపెట్టింది. జూనియర్ న్యాయవాదులను ప్రోత్సహించేలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన ఈ పథకం సత్ఫలితాలు ఇచ్చింది. 2019 తర్వాత జూనియర్ న్యాయవాదుల సంఖ్య గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనం. ఈ పథకం ద్వారా నెలకు రూ.5వేల చొప్పున ఏడాదికి రూ.60 వేల ప్రకారం ఆర్థికసాయం అందజేశారు. ఇలాంటి పథకం దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే అమలవ్వడం విశేషం.
చిత్తశుద్ధి ఏదీ బాబూ?
వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ‘వైఎస్సార్ నేస్తం’ పథకం కింద జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5 వేలు చొప్పున స్టైఫండ్ అందజేశారు. ఈ రూ.5 వేలు ఎందుకూ సరిపోదు.. అధికారంలోకి రాగానే నెలకు రూ.10 వేలు ఇస్తామంటూ చంద్రబాబు, లోకేష్ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. ప్రభుత్వం వచ్చాక హామీని అటకెక్కించేశారు. ఇకనైనా హామీని అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని న్యాయవాదులు కోరుతున్నారు.
స్టైఫండ్ రూ.10వేలు ఇస్తామని ఎన్నికల్లో ప్రచారం
గద్దెనెక్కిన తర్వాత ‘లా నేస్తం’ అమలులో రిక్తహస్తం
పథకం కోసం జూనియర్ న్యాయవాదుల ఎదురుచూపు
ఇలా అయితే.. ఎలా నేస్తం?


