నెట్టికంటుడి నిజరూప దర్శనం నిలిపివేత
● రేపటి నుంచి బాలాలయంలో స్వామి వారి దర్శనం
నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయం, ధ్వజస్తంభం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బాలాలయం
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల 27 నుంచి స్వామివారి నిజరూప దర్శనాన్ని నిలిపివేయనున్నారు. ఆలయం వద్ద దాతల సహకారంతో గర్భాలయం, విమాన గోపురం, ముఖ మండపం నిర్మించాలని నిర్ణయించారు. త్వరలో ప్రారంభం కానున్న పనులు దాదాపు మూడు నుంచి నాలుగు నెలలు సాగనున్నాయి. ఈ క్రమంలోనే స్వామి మూలవిరాట్ దర్శనాన్ని నిలిపివేయాలని ఆలయ అధికారులు, కమిటీ వారు నిర్ణయం తీసుకున్నారు. గర్భాలయ పనులు పూర్తయిన తరువాత జూన్ 27 నుంచి తిరిగి మూలవిరాట్ దర్శనాన్ని భక్తులకు కల్పించనున్నట్లు ఆలయ ఈవో మేడేపల్లి విజయరాజు తెలిపారు.
బాలాలయంలో స్వామి..
నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం ఆలయ ధ్వజస్తంభం వద్ద బాలాలయాన్ని నిర్మించారు. ఆలయంలో కొలువుదీరిన మూలవిరాట్ రూపంలోనే టేకుతో రూపొందించిన 8 అడుగుల స్వామివారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టించనున్నారు. ఈ నెల 28న ఉదయం 9.15 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం పాంచరాత్ర ఆగమ సలహాదారుల ఆధ్వర్యంలో బాలాలయంలో విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. గర్భాలయం, విమాన గోపురం, ముఖ మండపం పనులు పూర్తయ్యేవరకూ స్వామివారు బాలాలయం నుంచే భక్తులకు దర్శనమివ్వనున్నారు. నిత్య అలంకరణ, పూజలు అందుకుంటూ భక్తులను అనుగ్రహించనున్నారు.
3న ఆలయం మూసివేత
గుంతకల్లు రూరల్: చంద్రగ్రహణం నేపథ్యంలో మార్చి 3న కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం మూసివేయనున్నట్లు ఆలయ ఈవో మేడేపల్లి విజయరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం ఆరు గంటలలోపు స్వామికి ప్రాతఃకాల ఆరాధన, పూజలు నిర్వహించిన అనంతరం ఆలయాన్ని మూసివేస్తామన్నారు. మార్చి 4న ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేసి స్వామి దర్శనాన్ని పునఃప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
నెట్టికంటుడి నిజరూప దర్శనం నిలిపివేత


