●నయన మనోహరం
● ఘనంగా చంద్రమౌళీశ్వరుడి బ్రహ్మ రథోత్సవం
● గవిమఠంలో మార్మోగిన శివనామస్మరణ
ఉరవకొండ: ‘జయ జయ మహదేవ...శంభో సదా శివ’ అంటూ భక్తులు చేసిన ప్రణవ నాదం ప్రతిధ్వనించింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో గవిమఠం ప్రాంగణం కిటకిటలాడింది. చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవం నయన మనోహరంగా సాగింది. ఉదయం మూలవిరాట్కు విశేష పూజలు, అభిషేకాలు, మహా రుద్రాభిషేకాలు నిర్వహించారు. గవిమఠం 8వ పీఠాధిపతులు జగద్గురు చెన్నబసవరాజేంద్రస్వామి, ఉత్తరాధి కారి డాక్టర్ కరిబసవ రాజేంద్రస్వామి, జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, గవిమఠం ఇన్చార్జ్ సహాయ కమిషనర్ గంజిమల్లికార్జున ప్రసాద్ ఆధ్వర్యంలో చంద్రమౌళీశ్వరుడి ఉత్సవ మూర్తిని విశేషంగా అలంకరించి మహారథం వద్దకు తీసుకొచ్చారు. శాస్త్రోక్తంగా పూజలు చేసి ఉత్సవమూర్తిని రథంపై కొలువు తీర్చి ఉత్సవం ప్రారంభించారు. గవిమఠం ఆస్థాన గజలక్ష్మి (ఏనుగు) రథాన్ని అనుసరిస్తూ ముందుకు కదలగా... హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు రథాన్ని లాగుతూ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. రథంపై పండ్లు విసిరి మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో గవిమఠం ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
●నయన మనోహరం


