కశింకోట: ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించి, నగదు స్వాహా చేసి, మోసగించిన కేసులో పదేళ్లకు పైగా పరారీలో ఉన్న నిందితుడిని మంగళవారం కోర్టు ఆదేశాల మేరకు అరెస్టు చేసినట్లు సీఐ అల్లు స్వామినాయుడు తెలిపారు. ఏపీపీఎస్సీ గ్రూప్–2 ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించి 2013లో పలువురి నుంచి మండలంలోని తాళ్లపాలెం గ్రామానికి చెందిన బోదెపు ప్రకాశ్ రూ.32.71 లక్షలు వసూలు చేశాడు. దీనిలో రూ.12 లక్షలు నగదు రూపంలోను, మిగిలిన రూ.20.71 లక్షలు నిందితుడి బ్యాంకు ఖాతాకు జమ చేసినట్లు సాక్షులు తెలిపారని చెప్పారు. ఈ విషయమై తెరపల్లి పరదేశి, ఇతర బాధితులు ఫిర్యాదు మేరకు 2015లో కేసు నమోదు చేసినట్టు చెప్పారు. అప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. న్యాయ స్థానం నాన్ బెయిల్బుల్ వారెంట్ ఇచ్చిన మేరకు అరెస్టు చేశామన్నారు. కోర్టులో హాజరు పరిచి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ చెప్పారు.


