మునగపాక(యలమంచిలి రూరల్): యలమంచిలి మండలం ములకలాపల్లిలో విద్యుత్ ప్రమాదంలో రైతు అప్పలనాయుడు(62) మృతి చెందాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ములకలాపల్లికి చెందిన దుబాసి అప్పలనాయుడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగానే మంగళవారం ఉదయం పొలం పనులు చేసేందుకు వెళ్తుండగా, గాలీవర్షానికి విద్యుత్ వైరు తెగి కింద పడిపోయింది. పొరపాటున అప్పలనాయుడు వైరును తాకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచిన అప్పలనాయుడు మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. మృతుడి కుమారుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


