విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయం మహిళా ఇంజినీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (2022–26 బ్యాచ్) విభాగానికి చెందిన విద్యార్థినులు అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించారు. రోషినిషా బేగం, ఆర్.నవ్య ప్రముఖ సంస్థ ‘స్నైడర్ ఎలక్ట్రిక్’ క్యాంపస్ నియామకాల్లో రూ.12 లక్షల వార్షిక వేతనంతో ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ సంస్థల్లో ఏయూ విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం విశ్వవిద్యాలయానికి గర్వకారణమన్నారు. రోషినిషా బేగం స్నైడర్ ఎలక్ట్రిక్తో పాటు వేదాంత సంస్థలోనూ ఉద్యోగానికి ఎంపికవగా, ఆర్.నవ్య ఎల్ అండ్ టీ సంస్థలోనూ అవకాశాన్ని దక్కించుకుంది. కార్యక్రమంలో ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఆర్.పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.


