గొలుగొండ: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు భావితరాలకు స్ఫూర్తిప్రదాత అని, ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా మండలంలోని కృష్ణదేవిపేటలో గల అల్లూరి, గంటం దొర సమాధుల వద్ద స్పీకర్తో పాటు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ శనివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ అల్లూరి పార్కును అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. రూ.30 లక్షల వ్యయంతో పార్కులో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ కృష్ణదేవిపేట కేంద్రంగా అల్లూరి సీతారామరాజు పోరాటాలు చేయడం మన ప్రాంత ప్రజలు అదృష్టమని తెలిపారు. ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడు తూ విద్యార్థులు అల్లూరిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుని, మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని చెప్పారు. అల్లూరి జీవిత చరిత్రను చక్కగా వివరించిన చోద్యం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని నర్ల ప్రణితను స్పీకర్, కలెక్టర్, ఎమ్మెల్యే రామకృష్ణ, ఎస్పీ సన్మానించారు. కార్యక్రమంలో నర్సీటప్నం ఆర్డీవో వి. వి, రమణ,డీఎస్పీ శ్రీనివాసరావు, తహసీల్దార్ వి. శ్రీనివాసరావు, రూరల్ సిఐ రేవతమ్మ పాల్గొన్నారు.


