కలెక్టర్ విజయ కృష్ణన్
నక్కపల్లి: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్) కార్యక్రమం వేగవంతం చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. స్థానిక 207, 208 పోలింగ్ బూత్లలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్తో కలిసి ఆమె శనివారం పరిశీలించారు. బీఎల్వోల నుంచి వివరాలను తెలుసుకున్నారు. ఓటర్ల నమోదు ధ్రువీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఇంటింటి సర్వే, దరఖాస్తుల పరిశీలన తదితర అంశాలపై సమీక్షించారు. సర్వే పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి ఓటరును బూత్ లెవెల్ అధికారులు కలిసి వివరాలు సేకరించాలని తెలిపారు. అనంతరం ఆమె నియోజకవర్గంలోని అన్ని మండలాల ఏఈఆర్వోలు, ఎంపీడీవోలు, సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించారు. విమర్శలు, ఫిర్యాదులకు తావులేకుండా సర్వే నిర్వహించాలని సూచించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. దరఖాస్తు ఫారాలు ఓటర్లందరికీ అందేలా చూడాలని తెలిపారు. ఆర్డీవోలు, డీఆర్వోలు, ఏఈఆర్వోలు ‘సర్’ సర్వేను ఎప్పటికప్పు డు పరిశీలించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వి.వి.రమణ, తహసీల్దార్ చిన్నికృష్ణ, డీటీ నారాయణరావు, ఎంపీడీవో చలపతిరావు, ఏవో సీతారామరాజు, బీఎల్వోలు పాల్గొన్నారు.


