‘జనసేన’ తీరు అప్రజాస్వామ్యం | - | Sakshi
Sakshi News home page

‘జనసేన’ తీరు అప్రజాస్వామ్యం

Jul 5 2026 3:06 AM | Updated on Jul 5 2026 3:06 AM

ఎస్‌.రాయవరం: పాయకరావుపేటలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నా.. పోలీసులు చోద్యం చూస్తున్నారని కేవీపీఎస్‌ నాయకులు మోర్త సత్యనారాయణ ఆరోపించారు. ‘ప్రశ్న’ రావణ్‌ను పోలీసులు అరెస్టు చేసి, విచారణ నిర్వహిస్తున్న సమయంలో అడ్డురోడ్డులోని నక్కపల్లి పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయం వద్ద జనసేన నాయకులు ప్రవర్తించిన తీరు అప్రజాస్వామ్యమని ఆయన మండిపడ్డారు. అడ్డురోడ్డులో ఆయన శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రశ్నించే గొంతులను నొక్కేయాలని చూడడం, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం, పోలీసు స్టేషన్ల వద్ద దౌర్జన్యాలకు దిగడం అత్యంత ప్రమాదకర పరిణామమని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వ్యక్తిపై గుంపుగా దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే హత్యాయత్నం, దౌర్జన్యం తదితర సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అధికార పార్టీ అండ ఉందనే ధీమాతో ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాళ్ల దేముడు, యాదగిరి నవీన్‌తో పాటు పలువురు కేవీపీఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement