మాడుగుల/రూరల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని సీపీఎం మండల కార్యదర్శి ఇరటా నర్సింహమూర్తి విమర్శించారు. వంట గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ మండలంలోని శంకరం పంచాయతీ శివారు బొడ్డరేవు గ్రామంలో గిరి మహిళలతో కలిసి ఖాళీ గ్యాస్ సిలిండర్లు పట్టుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంట గ్యాస్ సిలిండరుపై రూ. 60, వాణిజ్య సిలిండర్పై రూ.115 పెంచడం అన్యాయమన్నారు. వంట గ్యాస్ ధర పెంచి ప్రజలపై తీవ్రభారం మోపిందన్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ కలిపి చేస్తున్న యుద్ధం వల్ల ప్రజలపై భారం వేసిందన్నారు. తక్షణమే వంట గ్యాస్ ధర తగ్గించాలని చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు కె. భవానీ మాట్లాడుతూ చిన్న కుటుంబాలతో పోషణ గడవక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ముగ్గురు సంతానం కనాలని సీఎం చంద్రబాబు ప్రచారం చెయ్యడం తగదన్నారు. సీపీఎం దేవరాపలి మండల కార్యదర్శి బి.టి.దొర, నాయకులు కొర్రా దేవదాసు, బుసరి మల్లుదొర, కొర్రా నాగార్జున, మువ్వల బాలకృష్ణ, బచ్చల ఈశ్వరరావు, దిప్పల ఈశ్వరరావు, గిరిజన మహిళలు పాల్గొన్నారు.


