మాజీ మంత్రి కన్నబాబును సత్కరిస్తున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్
అనకాపల్లి/మునగపాక: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ విశాఖ, విజయనగరం జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబును మంగళవారం కాకినాడలో పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిశారు. అనకాపల్లి జిల్లా అధ్యక్షునిగా నియమితులైన ప్రసాద్ ఈ సందర్భంగా మాజీ మంత్రి కన్నబాబు ఆశీస్సులను తీసుకొని సత్కరించారు. తనకు అవకాశం కల్పించడంలో కృషి చేసిన కన్నబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాలు మేరకు జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. 22 మాసాలైనా వృద్ధులకు కొత్త పింఛన్లు, మహిళలకు నెలకు రూ.1500 ఇవ్వలేదని విమర్శించారు. వీటితో ఇతర సంక్షేమ పథకాల అమలులో విఫలమైందన్నారు. ఈ విషయాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ సీఈసీ సభ్యుడు బోదెపు గోవింద్, అనకాపల్లి 80, 81 వార్డు అధ్యక్షులు కె.ఎం. నాయుడు, బొడ్డేడ శివ, పార్టీ నాయకులు మొల్లేటి శంకర్, వెంకట్ పాల్గొన్నారు.


