ప్రజారోగ్యం ఫినిష్!
కొందరి స్వార్థం అనర్థాల కు దారితీసేదిగా ఉంది...లాభాలు ఆర్జించాలన్న దురాశతో ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఎక్కువ కాలం నిల్వ ఉన్న, పాడైన చేపలను తాజావంటూ విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. వాటిని తిన్నవారు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు.
నర్సీపట్నం: నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో కుళ్లిన, నిల్వ ఉన్న చేపలు విక్రయిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. అపరిశుభ్ర వాతావరణం నడుమ నాణ్యత లేని చేపలను విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. చెడిపోయిన చేపలను బహిరంగంగా అమ్ముతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. నర్సీపట్నంలో సీబీఎం, ఇందిరా మార్కెట్, పెదబొడ్డేపల్లి, శారదనగర్ ప్రాంతాల్లోని మెయిన్ రోడ్డుకు ఇరువైపులా చేపల దుకాణాలున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రతి ఆదివారం భారీ ఎత్తున చేపల అమ్మకాలు జరుగుతాయి. వ్యాపారులు పోటీ పడి అధిక మొత్తంలో చేపలను మార్కెట్కు తీసుకువస్తున్నారు. ఆదివారం విక్రయించగా మిగిలి పోయిన చేపలను రోజుల తరబడి నిల్వ చేసి అమ్ముతున్నారు. కొనుగోలు చేసిన చేపలను ఇంటికి తీసువెళ్లి కోస్తే దుర్వాసన వస్తున్నట్టు స్థానికులు తెలిపారు. దీంతో కిలో రూ.300 చొప్పున కొనుగోలు చేసిన చేపలను పారేయవలసి వస్తోందని వారు వాపోతున్నారు. మరికొందరు తెలియక వాటినే తింటున్నారు.
నిబంధనలు పాటించని విక్రయదారులు
చేపల విక్రయదారులు కనీస నిబంధనలు పాటించడం లేదు. విక్రయ కేంద్రాల వద్ద పరిశుభ్రత మచ్చుకై నా కనిపించడం లేదు. చేపలను పరిశుభ్రమైన ఐస్ స్టోరేజ్లో నిల్వ చేయాలి, కానీ అలా ఎక్కడా నిల్వ చేయడం లేదు. చేపల విక్రయానికి రిటైలర్లకు తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలి. ఇక్కడ వ్యాపారం చేస్తున్న వారిలో చాలా మందికి లైసెన్స్లు లేవు. తాజా చేపలు కాకుండా నాణ్యతలేని, పాడైపోయిన చేపలను విక్రయిస్తున్న, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యాపారులపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. చేపల దుకాణాలపై పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. పాడైపోయిన చేపలు తినడం వల్ల ప్రజలు డయేరియా వంటి వ్యాధుల భారిన పడే ప్రమాదం ఉంది. ఇప్పటికై నా నాణ్యత కలిగిన చేపలను విక్రయించేలా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఆదివారం ఒక్క రోజే రూ.15 లక్షల అమ్మకాలు
నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల పరిధిలో ఆదివారం ఒక్క రోజే రూ.15 లక్షల మేర అమ్మకాలు జరుగుతున్నాయి. తాండవ నదిలో లభ్యమయ్యే చేపలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకుని తాండవ నది చేపలంటూ చెరువుల్లో పెంచే చేపలను విక్రయిస్తున్నారు. అంతేకాకుండా సోమవారం నుంచి శనివారం వరకూ మిగిలిన చేపలను ఐస్ వేసి నిల్వ ఉంచి ఆదివారం నాడు విక్రయిస్తున్నారు.
సీబీఎం కాంపౌండ్ ప్రాంతంలో
విక్రయిస్తున్న నాణ్యతలేని చేపలు
నాణ్యత లేని చేపలు విక్రయిస్తే ఉపేక్షించం...
పాడైపోయిన చేపలను విక్రయిస్తే ఉపేక్షించం. చేపల దుకాణాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. నాణ్యత లేని చేపలను విక్రయించి ప్రజారోగ్యాన్ని విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటాం. చేపల వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్స్లు కలిగి ఉండాలి. నిబంధనలు అతిక్రమించిన వారి లైసెన్స్ రద్దు చేస్తాం.
– జంపా సురేంద్ర,
మున్సిపల్ కమిషనర్, నర్సీపట్నం
నర్సీపట్నంలో యథేచ్ఛగా
కుళ్లిన చేపల విక్రయాలు
ఐదు రోజుల కన్నా ఎక్కువగా నిల్వ ఉన్నవాటినే తాజావంటూ అమ్మకాలు
ప్రతీ ఆదివారం రూ.లక్షల్లో వ్యాపారం
ప్రజారోగ్యంతో చెలగాటం,
పట్టించుకోని అధికారులు
ప్రజారోగ్యం ఫినిష్!


