● పకడ్బందీగా నిర్వహించాలనికలెక్టర్ నిశాంతి ఆదేశం
సాక్షి, పాడేరు: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల (పేరెంట్స్–టీచర్స్) సమావేశాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ టి. నిశాంతి విద్యాశాఖ అధికారులను, ఉపాధ్యాయ వర్గాలను ఆదేశించారు. గురువారం తన కార్యాలయం నుంచి మెగా పీటీఎం ఏర్పాట్లపై ఆమె వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ సమావేశానికి తల్లిదండ్రుల భాగస్వామ్యం తప్పనిసరి అని, తల్లిదండ్రుల వివరాలతో పాటు హాజరును లీప్ యాప్ ద్వారా నమోదు చేయాలన్నారు. సమావేశాల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతులతో పాటు సురక్షిత తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులను ఈ సమావేశాలకు ఆహ్వానించాలని, ప్రభుత్వం పంపిణీ చేసిన విద్యా కిట్లను ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ తిరుమణి శ్రీపూజ, ఇన్చార్జి డీఈవో, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమళ, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ స్వామినాయుడు, గురుకులం ఓఎస్డీ మూర్తి పాల్గొన్నారు.
2034 పాఠశాలల్లో ఏర్పాట్లు
జిల్లాలోని 11 మండలాల పరిధిలోని 2034 ప్రభుత్వ పాఠశాలల్లో పీటీఎం నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.40,38,300 మంజూరు చేయగా, ఆయా పాఠశాలల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తు న్నట్లు సమగ్ర శిక్ష అధికారులు తెలిపారు. అన్ని పాఠశాలల్లో హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ఏర్పాట్లను సమీక్షించారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ, జడ్పీ ఉన్నత పాఠశాలల్లో మామిడితోరణాలు కట్టడం, టెంట్లు, బెంచీల ఏర్పాటు పనుల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. తమ తల్లిదండ్రులకు ఘన స్వాగతం పలికేందుకు విద్యార్థులంతా సిద్ధమయ్యారు.


