రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న హింస, అత్యాచారాలు, దాడుల ఘటనలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ మహిళా నేతలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ, మహిళల భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు పాడేరులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పలువురు మహిళా నాయకులు ప్రభుత్వ తీరును ఖండిస్తూ తమ అభిప్రాయాలను వెల్లడించారు.
● కూటమి పాలనలో రక్షణ ఎక్కడ ● సీఎం, హోంమంత్రి తీరుపై ఆగ్రహం
● రెడ్బుక్ పేరిట వేధింపులు ● పాడేరులో వైఎస్సార్సీపీ మహిళల నిరసన
సాక్షి, పాడేరు: కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు, గుంటూరు, బద్వేలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు మంగళవారం జిల్లా కేంద్రం పాడేరులో వైఎస్సార్సీపీ మహిళా నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆ విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో సుమారు గంటపాటు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ నినాదాలు చేశారు.
● రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, దాడులు తదితర ఘటనలను తీవ్రంగా ఖండించిన మహిళా నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత తీరును విమర్శించారు. మహిళలు స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితిని రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకొచ్చిందని, రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో మహిళలు కూడా వేధింపులకు గురవుతున్నారని ఆరోపించారు.
● రెడ్బుక్ రాజ్యాంగానికి బదులుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని అమలు చేయాలని, మహిళలకు పూర్తి రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన విగ్రహానికి వినతిపత్రం సమర్పించి తమ నిరసన వ్యక్తం చేశారు.
అత్యాచార ఘటనలు దారుణం
మహిళలపై అత్యాచార ఘటనలు దారుణం. ఇంత పెద్ద పోలీసు వ్యవస్థ ఉండికూడా మహిళలకు రక్షణ చర్య లు కరువయ్యాయి.బయటకు రావాడానికే మహిళలు భయపడాల్సిన పరిస్థితిని కూటమి ప్రభుత్వం తీసుకువచ్చింది. – కోడా సుశీల,
వైఎస్సార్సీపీ మహిళా విభాగం నేత, పాడేరు
పట్టపగలు రక్షణ కరువు
కూటమి ప్రభుత్వ పాలనలో పట్టపగలు కూడా మహిళలకు స్వేచ్ఛ కరువైంది.ఎక్కడికక్కడ జరుగుతున్న నేరాలు,ఘోరాలతో మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నపిల్లలు, బాలికలు, యువతులకు రక్షణ కరువైంది. – లకే రామసత్యవతి,
పీఎసీఎస్ మాజీ పర్సన్ ఇన్చార్జి, పాడేరు


