కొయ్యూరు: గర్భిణులు, బాలింతలు బలమైన పౌష్టికాహారం తీసుకుంటేనే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని రాజేంద్రంపాలెం వైద్యాధికారి డాక్టర్ జగదీష్ నాయక్ సూచించారు. ఇందుకోసం రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత ద్వారా పిల్లల్లో వచ్చే ఆరోగ్య సమస్యలను, లోపాలను గుర్తించేలా శనివారం అంగన్వాడీ వర్కర్లతో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మానవుడు ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా ఆహారపు అలవాట్లు మారాలని, దీనివల్ల పలు రకాల దీర్ఘకాలిక వ్యాధులను దూరం పెట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో ధూమపానం, మద్యపానం వల్ల వచ్చే అనర్థాలను వివరించారు. అనంతరం సీడీపీవో దేవామణి మాట్లాడుతూ.. ఏఐ సహాయంతో పిల్లల్లో ఉండే శారీరక, మానసిక లోపాలను ఏ విధంగా గుర్తించవచ్చో అంగన్వాడీ కార్యకర్తలకు వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు, బీపీసీ శేఖర్ పాల్గొన్నారు.


