ఢిల్లీ ఎయిమ్స్ బృందం ప్రశంసలు
జి.మాడుగుల: గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను ప్రజలకు చేరువ చేయడంలో ఆశా కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమని న్యూఢిల్లీకి చెందిన ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) బృంద సభ్యులు దిలీప్ కుమార్, విద్యాసాగర్ తెలిపారు. మండలంలోని గడుతూరు పంచాయతీలో శుక్రవారం ‘విలేజ్ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్’ సమావేశం నిర్వహించారు. ఎయిమ్స్ ఆధ్వర్యంలో, ఈక్విప్ వైఎస్ కసుమ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న ఆరోగ్య సమస్యలు, పారిశుధ్యం, పోషకాహార లోపాలపై సమగ్రంగా చర్చించి, వాటి నివారణకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు.
వ్యాధుల ముందస్తు గుర్తింపు.. : మలేరియా, డెంగ్యూ, క్షయ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించి బాధితులకు సకాలంలో వైద్యం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎయిమ్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. ముఖ్యంగా శిశు, మాతృ మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారు సూచించారు. తీవ్రమైన మరియు మధ్యస్థ పోషకాహార లోపాలతో బాధపడుతున్న పిల్లలను గుర్తించి, వారిని వెంటనే పోషకాహార పునరుద్ధరణ కేంద్రాలకు తరలించాలని తెలిపారు. ఆశా కార్యకర్తలకు ప్రత్యేక అవగాహన కల్పించి, ప్రతిరోజూ గ్రామ సందర్శనలు నిర్వహించేలా చూడాలని ఎయిమ్స్ బృందం సూచించింది. గ్రామీణ ప్రజల్లో ఆరోగ్య అవగాహన, పరిశుభ్రత, పోషకాహారంపై చైతన్యం పెంపొందించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి అచ్చంనాయుడు, ఎయిమ్స్ ప్రతినిధులు దిలీప్ కుమార్, విద్యాసాగర్, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పేరినాయుడు, హెల్త్ అసిస్టెంట్ బాలయ్యదొర, ఏఎన్ఎం శాంతికుమారి, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.


