ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరాజు,మత్స్యలింగం
మాట్లాడుతున్న పాడేరు, అరకులోయ ఎమ్మెల్యేలు
సాక్షి,పాడేరు: మెగా డీఎస్సీ పేరుతో టీచర్ పోస్టులను రూ.లక్షలకు అమ్ముకుని అవినీతి,అక్రమాలకు పాల్పడిన మంత్రి లోకేష్,ఇతర బాధ్యులపై సీబీఐతో విచారణ జరిపించాలని పాడేరు,అరకులోయ ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు(వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు),రేగం మత్స్యలింగంలు డిమాండ్ చేశారు.సోమవారం వారు ‘సాక్షి’తో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అర్హులైన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలు వెలుగు చూస్తుంటే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్,ఇతర ప్రభుత్వ పెద్దలు సమర్ధించుకోవడం దారుణమన్నారు.టీచర్ పోస్టులను అమ్ముకున్న లోకేష్ను మంత్రి పదవి నుంచి తొలగించి సమగ్ర విచారణ జరిపేంత వరకు వైఎస్సార్సీపీ పోరాటం ఉధృతం చేస్తుందని చెప్పారు. అన్యాయానికి గురైన అభ్యర్థుల పక్షాన న్యాయ పోరాటం చేస్తామన్నారు.
సమస్య కలెక్టర్కు పట్టదా...
రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ టీచర్ పోస్టుల భర్తీలో అవినీతి అక్రమాలు జరిగాయని,న్యాయ విచారణ జరపాలని కలెక్టర్ నిశాంతికి వినతిపత్రం అందిస్తే సరిగా స్పందించకపోవడం అన్యాయమని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు.డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సమగ్రంగా వివరించాలని తాము ప్రయత్నిస్తుండగా పట్టించుకోకుండా కలెక్టర్ చాంబర్లోకి వెళ్లిపోయారన్నారు. గిరిజన ఎమ్మెల్యేలంటే కలెక్టర్కు చిన్నచూపు తగదన్నారు.సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే అన్ని వర్గాల ప్రజలు,ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్తో పాటు అధికారులకు ఉందని వారు చెప్పారు.


