మాట్లాడుతున్న
జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు
విశాఖ స్పోర్ట్స్ : జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి క్రికెట్ శిక్షణా శిబిరాలు ఆదివారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమం వైఎస్సార్ స్టేడియంలో నిర్వహించారు. జిల్లాలోని వైఎస్సార్ స్టేడియం, స్టీల్ప్లాంట్ స్టేడియం, జింక్ గ్రౌండ్, ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం వేదికలుగా శిబిరాలు నిర్వహించారు. అండర్–10 నుంచి అండర్–16 వరకు బాలురతో పాటు 50 మంది బాలికలు శిక్షణ పొందారు. శిబిరాల్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో నైపుణ్యాలను మెరుగుపరుచుకునేలా కోచ్లు శిక్షణ అందించారు. ముగింపు సందర్భంగా శిక్షణార్థుల మధ్య పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన అండర్–14, అండర్–16 క్రీడాకారులను ‘ప్రాబబుల్స్’గా ఎంపిక చేసి, భవిష్యత్తులో జిల్లా జట్ల ఎంపికలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడు జి.ఎస్. వర్మ, కార్యదర్శి పార్థసారథి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


