పాయకరావుపేట: ఆలయాల్లో చోరీలకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్టు నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఆయన స్థానిక పోలీసు స్టేషన్లో శనివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పాయకరావుపేట పట్టణంలోని కడిమి వారి వీధికి చెందిన గుద్దాటి రాజు అలియాస్ చిన్న అనే వ్యక్తి చుట్టుపక్కల ఉన్న ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్టు చెప్పారు. పట్టణంలోని దుర్గానగర్ కాలనీలో గల దుర్గాలమ్మ గుడిలో 2 తులాల బంగారం, రూ.50 వేల నగదు, అరట్లకోట గ్రామ పరిధిలో ఓరుగుంటాలమ్మ, కనకదుర్గమ్మ ఆలయాల్లో రూ.5 వేల నగదు, పట్టణంలోని బృందావనంలో గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో రూ.1.75 లక్షల విలువ కలిగిన బంగారు ఆభరణాలు చోరీ చేసినట్టు తెలిపారు. నిందితుడు రాజుపై తుని, నర్సీపట్నం, అనకాపల్లి, అచ్యుతాపురం పోలీసు స్టేషన్ల్లో కేసులు నమోదైనట్టు చెప్పారు. రాజుపై ఇప్పటివరకు 21 కేసులు నమోదైనట్టు తెలిపారు. నిందితుని వద్ద నుంచి 2.56 తులాల బంగారం, రూ.2,520 నగదు రికవరీ చేశామన్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్టు చెప్పారు. ఎంతో కృషి చేసి కేసును చేధించిన సీఐ ఎస్.శంకరరావు, ఎస్ఐ పురుషోత్తం, హెచ్సీ వెంకట కిరణ్ను, కానిస్టేబుల్ సతీష్, నారాయణరావు, చించయ్య, మదీనాలను జిల్లా పోలీసు అధికారులు అభినందినట్టు డీఏస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు.


