దేవరాపల్లి: మండల కేంద్రం దేవరాపల్లి గుమ్మడివీధిలో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన జాగరపు పైడితల్లి ఇంటిలో ట్రంక్ పెట్టెలో భద్రపరిచిన 5 తులాలకు పైబడి బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు చోరీకి గురయ్యాయి. స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ శనివారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పైడితల్లి ఈ నెల 24న వాడపల్లి వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్లి మరుసటి రోజు ఇంటికి వచ్చాక తన వద్ద ఉన్న డబ్బును ఇంటిమేడపై గదిలోని పెట్టెలో భద్రపరిచేందుకు వెళ్లాడు. అప్పటికే పెట్టె తెరిచి ఉండటంతో ఆందోళనకు గురైన బాధితుడు అందులో భద్రపరిచిన బంగారు అభరణాలు, డబ్బు చోరీకి గురైనట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ క్లూస్ టీమ్లను, డాగ్ స్క్వాడ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. బాధితుడు పైడితల్లి పిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


