నక్కపల్లి: మండలంలో రాజయ్యపేట పంచాయతీలో జాతీయ గ్రామీణ ఉపాధి పనులకు సంబంధించి మస్తర్లను వీఆర్పీ జూమ్ కాల్ ద్వారా ఇతర ప్రాంతాల్లో ఉన్నవారికి వేస్తున్నారని రాజయ్యపేట గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. రాజయ్యపేట పంచాయతీలో 15 రోజుల క్రితం ఉపాధి పనుల్లో జరిగిన అవకతవకలపై ఫిర్యాదు చేశారు. అయినప్పటికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఎంపీడీవో, ఏపీవో దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే సమగ్ర విచారణ జరిపి గ్రామంలోని ఉపాధి పనుల్లో అక్రమాలు అరికట్టి తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. జూమ్ కాల్ ద్వారా ఆన్లైన్ మస్తర్లు వేయడం, ఇరత ప్రాంతాల్లో ఉన్నవారిని గ్రామంలో ఉన్నట్టు చెప్పడం సైబర్ నేరంగా పరిగణించాలన్నారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. వెంటనే చర్యలు చేపట్టకపోతే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. దీనికి అధికారులు స్పందించి సోమవారం క్షేత్రస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నక్కపల్లి మండల అధ్యక్షుడు వెలగా సుధాకర్రావు, ప్రధాన కార్యదర్శి బొంది గురన్న, రాజయ్యపేట గ్రామ శాఖ అధ్యక్షుడు పిక్కి కోదండరావు, నాయకులు పిక్కి చిన్నారి, పిక్కి కోటి, మైలపల్లి రాము, పిక్కి కోటేశ్వరరావు, ఆధిరాజు, కోట ముసలి, బొందలను అప్పలరాజు, వాసుపల్లి నూకరాజు, పిక్కి రాజు తదితరులు పాల్గొన్నారు.
చర్యలు తీసుకోవాలని
రాజయ్యపేట గ్రామస్తుల ఆందోళన


