రెబ్బెన: మండలంలోని కాగజ్నగర్ ఎక్స్రోడ్, ఇందిరానగర్ మద్యలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం కౌటాల మండలం వీర్దండికి చెందిన జాడి ప్రదీప్, జాడి మహేష్ బొలెరో వాహనంలో ఇంటి సామాను వేసుకుని మంచిర్యాల వైపు వెళ్తుండగా ఆసిఫాబాద్ వైపు నుండి రెబ్బెన వైపు ఐరన్ పైపుల లోడ్తో వెళుతున్న లారీని బొలెరో ఢీకొట్టింది. దీంతో లారీ రోడ్డు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో, బొలెరో రోడ్డుపైనే బోల్తా పడ్డాయి. బొలెరో నడుపుతున్న ప్రదీప్, మహేష్ క్యాబిన్లోనే ఇరుక్కుపోయారు. స్థానికుల సమాచారంతో ఎస్సై వెంకటకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని మహేష్ను బయటకు తీశారు. వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో ప్రదీప్ కాళ్లు క్యాబిన్లో ఇరుక్కుపోగా అతికష్టం మీద బయటకు తీశారు. క్షతగాత్రులను ముందుగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా బొలెరో రాంగ్రూట్లో కాగజ్నగర్ ఎక్స్రోడ్ వైపు వెళ్తూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడం మూలంగా ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.


