విద్యార్థుల భవితకు ‘పది’ కీలకం
కై లాస్నగర్: విద్యార్థుల భవిష్యత్కు పదో తరగతి కీలకమని, ఈ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి జిల్లాలోని పలువురు పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పరీక్షల సన్నద్ధతపై ఆరా తీస్తూ వారికి పలు సూచనలు చేశారు. విద్యార్థుల కోసం పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గైర్హాజరు కాకుండా చూడాలని అన్నారు. ఉదయం 5 గంటలకే నిద్రలేపి చదివించాలని, రాత్రి 10 గంటల వరకు క్రమబద్ధమైన జీవనశైలి అలవాటు చేయాలని సూచించారు. పరీక్షల దృష్ట్యా విద్యార్థులను మొబైల్ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచాలని అన్నారు. ఇంట్లో ఒత్తిడి లేని వాతావరణం కల్పించాలని, ఇతరులతో పోల్చుతూ పిల్లలను భయపెట్టకుండా ప్రోత్సాహకరంగా మాట్లాడాలని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేసి పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలన్నారు. రాష్ట్రంలోనే జిల్లా టాప్–3లో ఉండేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ గజేందర్, సెక్టోరియల్ అధికారులు రఘురమణ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


