ఆ వార్డులో ఏం జరుగుతోంది
రిమ్స్లో ‘ప్రసూతి’ సేవలు అస్తవ్యస్తం అందుబాటులో ఉండని వైద్యులు.. పీజీలపైనే భారం అత్యవసర సమయంలో గాలిలో కలుస్తున్న ప్రాణాలు ‘నిర్లక్ష్యం’పై నామ్కే వాస్తేగా చర్యలు
ఆదిలాబాద్టౌన్: రిమ్స్లోని ప్రసూతి వార్డులో అసలు ఏం జరుగుతుంది.. గర్భిణులు, బాలింతల ప్రా ణాలు ఎందుకు గాలిలో కలుస్తున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమనే వి మర్శలు వ్యక్తమవుతున్నా వారిపై చర్యలు మాత్రం కనిపించడం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాలతో కిందిస్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకొని మమా అనిపిస్తున్న అధికారులు అసలు బాధ్యులను వది లిపెట్టడం విస్మయానికి గురిచేస్తోంది. సొంతశాఖ తో పాటు అదే క్యాడర్ వారితో విచారణ చేపడుతుండటం వాస్తవాలు కప్పి పుచ్చేందుకు కారణమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం డ్యూటీలో ఉండి సేవలందించాల్సిన వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్కు ప్రాధాన్యతనిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రసవంకోసం వచ్చే గర్భి ణులకు అందుబాటులో ఉండటంలేదు. పీజీ విద్యార్థులు వైద్యులకు ఫోన్ ద్వారా సమాచా రం అందిస్తే వారు వచ్చేలోపు పరిస్థితి విషమించి చనిపోతున్న ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి.
మారని తీరు..
ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా రిమ్స్ వైద్యుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఒక్కరు కా దు.. ఇద్దరుకాదు..ఏకంగా గతేడాది ఏడుగురు గర్భి ణులు, బాలింతలతో పాటు పదుల సంఖ్యలో న వజాత శిశువులు మృతిచెందడం ప్రసూతి వార్డులో సేవల తీరుకు అద్దం పడుతోంది. పలువురు తల్లుల కు మాతృత్వం దక్కకపోగా, శిశువులకు తల్లి ప్రేమ దూరమవుతోంది. సేవలు అందించాల్సిన వైద్యులు ప్రైవేట్లో కాసులకు కక్కుర్తి పడడంతో పేదలకు నాణ్యమైన సేవలు అందని పరిస్థితి. ఇటీవల కలెక్టర్ పలువురిపై చర్యలు చేపట్టారు. అయినా పరి స్థితిలో మాత్రం మార్పు రాకపోవడం గమనార్హం.
అసలేం జరుగుతోంది..
ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు మహారాష్ట్ర వాసుల కు రిమ్స్ పెద్ద దిక్కుగా ఉంది. ఇతర జబ్బులతో పా టు గైనిక్ విభాగానికి పెద్ద సంఖ్యలో గర్భిణులు వ స్తుంటారు. అయితే ఇటీవల చోటు చేసుకున్న పలు ఘటనలు వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. ఈ విభాగంలో వైద్యులు 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లో అందుబాటులో ఉండాల్సి ఉండగా, మధ్యాహ్నం తర్వాత కనిపించకుండా పో తున్నారు. అలాగే ఉదయం 10 తర్వాతే విధులకు హాజరవుతున్నారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో వచ్చే గర్భిణులు సకాలంలో మెరుగైన వైద్యసేవలు అందక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి.
పీజీలతోనే సేవలు..
గైనిక్ విభాగంలో ఏడుగురు వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర వైద్యులున్నారు. వీరితో పాటు ఇద్ద రు సీనియర్ రెసిడెంట్లు, ఆరుగురు పీజీ వైద్యులు ఉ న్నారు. అదేవిధంగా హౌస్ సర్జన్లు పనిచేస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు వైద్యసేవలు అందించాల్సి ఉండగా, సమయపాలన పాటించకపోవడం, వారికి నచ్చినప్పుడే రావడం, ఇష్టమొచ్చినప్పుడు వెళ్లడం పరిపాటిగా మారింది. శిక్షణ పొందే పీజీ వైద్యులతోనే పూర్తిస్థాయి సేవలు అందించడంతో సమస్యలు ఎదురవుతున్నాయని పలువురు చెబుతున్నారు. ఇటీవల ఉట్నూర్ మండలానికి చెందిన ఓ బాలింత శిశువు మరణించిన సమయంలో ఇద్దరు పీజీ వైద్యు లే అందుబాటులో ఉండగా, సంబంధిత వైద్యురా లు శిశువు మరణించిన తర్వాత ఉదయం 6 గంట లకు అక్కడికి చేరుకోవడం గమనార్హం. అలాగే ప లువురు గైనకాలజిస్టులకు ఆదిలాబాద్లో క్లి నిక్లు ఉన్నాయి. వారు అక్కడే బిజీగా ఉండడంతోరిమ్స్లో గర్భిణులకు ఇబ్బందులు తప్పని పరిస్థితి.
బాలింత, శిశువు మృతి ఘటనలో నిర్లక్ష్యం చేసిన వారిని వదిలి ఏఎన్ఎంపై సస్పెన్షన్ వేటు వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముగ్గురు స్టాఫ్ నర్సులను డిప్యూటేషన్పై పంపించిన అధికారులు ఒక ఏఎన్ఎంపైనే చర్యలు చేపట్టడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్న తెలుత్తుతోంది. ఏఎన్ఎంకు ఓపీలో విదులు కేటాయించాల్సి ఉండగా, ప్రసూతి వార్డులో కొన్నేళ్లుగా విధులు కేటాయించారు. ప్రసవం చేయాల్సింది వైద్యులు, ఇతర సిబ్బంది కాగా సహాయ సిబ్బందిగా ఉండే ఏఎన్ఎంపై వేటు వేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న తలెత్తుతోంది. రిమ్స్లో ప్రొఫెసర్లతోనే కమిటీ వేయడంతో విచారణ సరిగా జరగడం లేదని, ఇతర శాఖల అధికారులతో నిష్పక్షపాతంగా విచారణ చేపడితే అసలు బాగోతం బయట పడుతుందని పలువురు పేర్కొంటున్నారు.ఈ విషయమై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ను వివరణ కోరగా, విచారణ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.


