
గోవిందా.. హరి గోవింద
ఫ వాడపల్లికి ఆధ్యాత్మిక శోభ
ఫ పెరిగిన భక్తుల రద్దీ
ఆత్రేయపురం: గోవిందా.. హరి గోవింద నామస్మరణ మార్మోగింది. కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయం శనివారం కిక్కిరిసింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. వేద పండితులు, అర్చకులు పువ్వుల రాయుడు వేంకటేశ్వర స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం తదితర పూజలు నిర్వహించారు. భక్తులు తలనీలాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు ఏడు ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు స్వామివారి దర్శనానికి కాలినడకన వచ్చారు. ఆలయ ఆవరణలో వేలాది మందికి అన్నసమారాధన జరిగింది. ఈ ఏర్పాట్లను దేవదాయ ధర్మదాయశాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈఓ భూపతిరాజు కిశోర్కుమార్ పర్యవేక్షించారు. అలాగే పురాణ ప్రసిద్ధి చెందిన ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి ఆలయం, ఆత్రేయపురం శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

గోవిందా.. హరి గోవింద