
ఏలేరుకు జలకళ
● ప్రస్తుత నిల్వ 16.06 టీఎంసీలు
● దిగువ ఆయకట్టుకు ధీమా
ఏలేశ్వరం: కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏలేరు ప్రాజెక్టులో నీటినిల్వలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో ప్రాజెక్టులో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. దీంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఏడాది వర్షాలు అశించిన స్థాయిలో పడడంతో ప్రాజెక్టులో నీటినిల్వలు ఒక్కసారిగా పెరిగాయి. వర్షాలకు జలాశయం పరివాహక ప్రాంతం నుంచి 2647 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరడంతో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. ఆదివారం నాటికి 86.56 మీటర్లకు గాను 82.12 మీటర్లు, 24.11 టీఎంసీలకు గాను 16.06 టీఎంసీలకు చేరుకున్నాయి. ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు చేరడంతో దిగువ ప్రాంతాలకు 300 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో మరింతగా నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
నీటినిల్వలు పెరగడంతో దిగువ ఆయకట్టుకు ఢోకా లేదు. ఆయకట్టులో సుమారు 54 వేల ఎకరాల సాగుకు నీరందించేందుకు అధికారులు నిర్ణయించారు. ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లోని వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలకు ఆయకట్టుతో పాటు విశాఖకు నీటిఎద్దడి ప్రమాదం తప్పింది. నీటినిల్వలు పెరగడంతో దిగువ ఆయకట్టుతో పాటు విశాఖ, తిమ్మరాజుచెరువు, పంపా ప్రాజెక్టుకు నీటి విడుదలకు ఇబ్బంది లేదని అధికారులు పెర్కొన్నారు.