
నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
అమలాపురం రూరల్: స్థానిక కలెక్టరేట్ గోదావరి భవన్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సోమవారం ఉదయం గంటల నుంచి యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి తగు పరిష్కార మార్గాలు పొందాలన్నారు.
భజే గణనాయకా..
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వర స్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో స్వామివారికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకాలు చేశారు. స్వామికి మహానివేదన అనంతరం వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లఘున్యాస, ఏకాదశ రుద్రాభిషేకాల్లో 44 మంది, లక్ష్మీగణపతి హోమంలో 19 మంది, నూతన వాహన పూజ 40 మంది, చిన్నారులకు తులాభారం నిర్వహించారు. స్వామివారి అన్నదాన పథకంలో 1,425 మంది అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయానికి వివిధ పూజలు, అన్నదాన విరాళాలుగా రూ.2,02,254 ఆదాయం లభించిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు.
నేడు ధాన్యం
బకాయిల విడుదల
అమలాపురం రూరల్: జిల్లాకు సంబంధించి రబీ ధాన్యం రూ.154.63 కోట్ల బకాయిలను రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం విడుదల చేస్తారని కలెక్టర్ మహేష్కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ఈ సమావేశంలో మెగా చెక్కును మంత్రి విడుదల చేస్తారన్నారు.
సత్యదేవుని ఆలయానికి భక్తుల తాకిడి
● 40 వేల మంది భక్తుల రాక
● ఘనంగా రఽథోత్సవం
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సత్యదేవుని సన్నిధిన శనివారం రాత్రి పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. అనంతరం నవ దంపతులు, ఇతర ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న వారు పెద్ద సంఖ్యలో సత్యదేవుని ఆలయానికి తరలివచ్చి వ్రతాలు చేసుకుని స్వామిని దర్శించుకున్నారు. భక్తులతో వ్రతమండపాలు, స్వామివారి దర్శనం అనంతరం సేదతీరే భక్తులతో విశ్రాంతి మండపాలు కిక్కిరిసిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించగా స్వామివారి వ్రతాలు మూడు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షలు ఆదాయం సమకూరింది.
కన్నుల పండువగా సత్యదేవుని రథోత్సవం
సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి రథోత్సవం ఆదివారం కన్నుల పండువగా జరిగింది. ఉదయం పది గంటలకు రథాన్ని తూర్పు రాజగోపురం ముందుకు తీసుకువచ్చారు. అనంతరం దేవేరులతో స్వామివారిని రథంపై ప్రతిష్ఠించి పూజలు చేశారు. అనంతరం దేవస్థానం ఇన్చార్జి ఈఓ రమేష్ బాబు కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు.
రద్దయిన రైళ్ల పునరుద్ధరణ
సామర్లకోట: స్థానిక రైల్వే స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తూ గతంలో రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరించినట్టు స్టేషన్ మేనేజర్ ఎం.రమేష్ ఆదివారం తెలిపారు. తిరుమల, ఉదయం, రత్నాచల్, విశాఖపట్నం–మచిలీపట్నం ఎక్స్ప్రెస్లతో పాటు సింహాద్రి, విశాఖపట్నం డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్, రాజమహేంద్రవరం– విశాఖపట్నం ఎక్స్ప్రెస్, గుంటూరు–రాయగడ ఎక్స్ప్రెస్లకు ఆదివారం నుంచి బుకింగ్ ప్రారంభించామన్నారు. ప్రయాణికులు గమనించాలని ఆయన సూచించారు. సుమారు 50 రోజుల క్రితం ఈ రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.

నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక