
కొత్త ప్రభుత్వం చేసేదేంటో చెప్పాలి
యూటీఎఫ్ సభలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు
అమలాపురం టౌన్: కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం శాఖల వారీగా విడుదల చేస్తున్న శ్వేతపత్రాల్లో గత ప్రభుత్వంపై విమర్శలే తప్ప అధికారంలోకి వచ్చిన తాము ఏం చేస్తామో చెప్పలేదని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ధ్వజమెత్తారు. శనివారం స్థానిక యూటీఎఫ్ భవన్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) స్వర్ణోత్సవాల సభకు ఎమ్మెల్సీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దీనికి యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంటీవీ సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, ఐవీ వెంకటేశ్వరరావు యూటీఎఫ్ జెండాను ఆవిష్కరించారు. యూటీఎఫ్ ఉద్యమ పితామహుల చిత్రపటాలకు ఎమ్మెల్సీలు, యూనియన్ రాష్ట్ర, జిల్లా నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ యూటీఎఫ్ 50 ఏళ్లలో సాధించిన విద్యా విజయాలను వివరించారు. స్వర్ణోత్సవ సంబరాలు పాటల సీడీని ఆవిష్కరించారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించారని చెబుతూ వారి త్యాగాలను కొనియాడారు. మధ్యాహ్నం నుంచి జరిగిన విద్యా సదస్సులో యూటీఎఫ్ పూర్వపు అధ్యక్షుడు జోజయ్య యూనియన్ 50 ఏళ్ల ప్రస్థానంలో సాధించిన విజయాలను వివరించారు. యూటీఎఫ్ ద్వారా ఉపాధ్యాయులు చేసిన సేవలు, సామాజిక బాధ్యతలు గొప్పవన్నారు. 1974 ఆగస్టు 10న యూటీఎఫ్ ఆవిర్భవించి నేటికి యాభై ఏళ్లు పూర్తి చేసుకుందని, ఉపాధ్యాయులంతా అదే స్ఫూర్తితో పనిచేయాలని వక్తలు పిలుపునిచ్చారు.