
భజే శ్రీనివాసా.. శ్రీవేంకటేశా
ఫ వాడపల్లికి శ్రావణ శోభ
ఫ భారీగా భక్తజనం రాక
ఆత్రేయపురం: ఆ చిద్విలాసుని క్షేత్రం భక్తజనంతో మురిసింది.. గంట గంటకూ కోలాహలంగా మారింది.. శ్రావణ మాసం, ఆపై రెండో శనివారం విద్యార్థులకు సెలవుదినం కావడంతో కిక్కిరిసింది. గోవింద.. హరి గోవింద నామస్మరణతో భక్తజనం ప్రదక్షిణ చేస్తుండగా, మరింత మంది తోడవడంతో ఆధ్యాత్మికత పరవళ్లు తొక్కింది. కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి క్షేత్రం మొదటి శ్రావణ శనివారం పురస్కరించుకుని రద్దీగా మారింది. ఉదయం స్వామివారిని ప్రత్యేక పుష్పాలతో వేద పండితులు, అర్చకులు అలంకరించారు. సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం తదితర పూజలను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. ఏడు శనివారాల నోము ఆచరించిన భక్తులు ఏడు ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అలాగే వివిధ ప్రాంతాల ప్రజలు కాలినడకన స్వామి ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. ఆలయ ఆవరణలో వేలాది మందికి అన్న సమారాధన నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తుల రాక మొదలైంది. క్యూలో బారులు తీరారు. అయితే ఉదయం 9 గంటల సమయంలో వర్షం వచ్చినా దానికి లెక్క చేయకుండా ప్రదక్షిణలు చేశారు. దేవదాయ ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈఓ భూపతిరాజు కిశోర్కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పురాణ ప్రసిద్ధి చెందిన ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి ఆలయం, ఆత్రేయపురం శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివార్లను భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

భజే శ్రీనివాసా.. శ్రీవేంకటేశా