మత్తు మందు ఇచ్చి చోరీ | - | Sakshi
Sakshi News home page

మత్తు మందు ఇచ్చి చోరీ

Aug 11 2024 2:32 AM | Updated on Aug 11 2024 2:32 AM

కాకినాడ క్రైం: కాకినాడ గాంధీనగర్‌లో వృద్ధురాలు ఓ మహిళ చేతిలో మోసానికి గురైంది. పెద్దమ్మగారు అంటూ పంచన చేరిన ఆ మహిళ జ్యూస్‌లో మత్తు మందు కలిపి వృద్ధురాలికి ఇచ్చి బంగారంతో ఉడాయించింది. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ గాంధీనగర్‌కు చెందిన వంగా మణి (79) ఇంట్లో ఒంటరిగా జీవిస్తుంది. ఆ విషయాన్ని గమనించిన ఓ మహిళ కొద్ది రోజులుగా మీ పొరుగునే ఉంటున్నానంటూ మాట కలిపింది. చేదోడువాదోడుగా ఉంటుండడంతో మణి ఆమెను నమ్మింది. ఈ క్రమంలో గత నెల 24న ఉదయం పెద్దమ్మగారు మీరు చాలా నీరసంగా ఉన్నారంటూ అభిమానం కురిపించి వృద్ధురాలి ఇంట్లో ఉన్న బీట్‌రూట్‌తో జ్యూస్‌ చేసి ఇచ్చింది. ఆ జ్యూస్‌లో మత్తు మందు కలిపి మణితో తాగించింది. ఆమె మత్తులోకి జారిన తర్వాత ఇంట్లో ఉన్న 64 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకెళ్లిపోయింది. మూడు రోజుల పాటు ఆ వృద్ధురాలు మత్తులోనే ఉంది. మూడు రోజుల తరువాత 27న లేచి చూసే సరికి ఆ మహిళ ఇచ్చిన జ్యూస్‌, అది తాగిన తర్వాత మత్తులోకి వెళ్లానన్న విషయం గుర్తొచ్చింది. కంగారుగా బీరువా వెతికేసరికి అందులో ఉన్న బంగారం చోరీకి గురైందన్న విషయం గుర్తించింది. ఇప్పటివరకూ ఆమె కోసం గాలించినా ఫలితంలేక పోలీసులను ఆశ్రయించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement