కాకినాడ క్రైం: కాకినాడ గాంధీనగర్లో వృద్ధురాలు ఓ మహిళ చేతిలో మోసానికి గురైంది. పెద్దమ్మగారు అంటూ పంచన చేరిన ఆ మహిళ జ్యూస్లో మత్తు మందు కలిపి వృద్ధురాలికి ఇచ్చి బంగారంతో ఉడాయించింది. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ గాంధీనగర్కు చెందిన వంగా మణి (79) ఇంట్లో ఒంటరిగా జీవిస్తుంది. ఆ విషయాన్ని గమనించిన ఓ మహిళ కొద్ది రోజులుగా మీ పొరుగునే ఉంటున్నానంటూ మాట కలిపింది. చేదోడువాదోడుగా ఉంటుండడంతో మణి ఆమెను నమ్మింది. ఈ క్రమంలో గత నెల 24న ఉదయం పెద్దమ్మగారు మీరు చాలా నీరసంగా ఉన్నారంటూ అభిమానం కురిపించి వృద్ధురాలి ఇంట్లో ఉన్న బీట్రూట్తో జ్యూస్ చేసి ఇచ్చింది. ఆ జ్యూస్లో మత్తు మందు కలిపి మణితో తాగించింది. ఆమె మత్తులోకి జారిన తర్వాత ఇంట్లో ఉన్న 64 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకెళ్లిపోయింది. మూడు రోజుల పాటు ఆ వృద్ధురాలు మత్తులోనే ఉంది. మూడు రోజుల తరువాత 27న లేచి చూసే సరికి ఆ మహిళ ఇచ్చిన జ్యూస్, అది తాగిన తర్వాత మత్తులోకి వెళ్లానన్న విషయం గుర్తొచ్చింది. కంగారుగా బీరువా వెతికేసరికి అందులో ఉన్న బంగారం చోరీకి గురైందన్న విషయం గుర్తించింది. ఇప్పటివరకూ ఆమె కోసం గాలించినా ఫలితంలేక పోలీసులను ఆశ్రయించింది.