
ప్రతిభకు ప్రోత్సాహం
రాయవరం: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసి వారికి ఉపకార వేతనాలను అందిస్తోంది నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పథకం (ఎన్ఎంఎంఎస్). కేంద్ర మానవ వనరుల శాఖ ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పొందేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహించి అర్హత పొందిన విద్యార్థులకు ఉపకార వేతనాలను అందిస్తుంది. ఈ పథకానికి దరఖాస్తుల స్వీకరణ ఆన్లైన్లో ప్రారంభమైంది. 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు అందించే స్కాలర్షిప్ పథకానికి ఏటా ఆదరణ పెరుగుతోంది.
2008–09 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం
పేద విద్యార్థుల్లో ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు 2008–09లో ఎన్ఎంఎంఎస్ పథకాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల సంచాలకుల ఆధ్వర్యంలో స్కాలర్షిప్కు అర్హత పొందేందుకు ప్రవేశ పరీక్షను నవంబర్లో నిర్వహిస్తారు. ఎంపికై న విద్యార్థులకు ఏటా రూ.ఆరు వేల స్కాలర్షిప్ను వారి అకౌంట్లలో వేస్తారు.
పరీక్షా విధానమిలా..
● ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్షిప్ ప్రవేశ పరీక్షకు అర్హులు.
● 7వ తరగతిలో మార్కుల ఆధారంగా పరీక్షకు అర్హత కల్పిస్తారు.
● ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఏడవ తరగతిలో 50శాతం, మిగిలిన తరగతుల వారు 55 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. బీసీ, ఓసీ విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 చెల్లించాల్సి ఉంది.
● ఆబ్జెక్టివ్ విధానంలో 150 మార్కులకు ప్రవేశ పరీక్ష ఉంటుంది.
● జిల్లా ప్రాతిపదికగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
● దరఖాస్తు చేసుకునే విద్యార్థుల తల్లితండ్రుల ఆదాయం ఏడాదికి రూ. 3.5 లక్షలకు మించి ఉండకూడదు.
● డివిజన్ కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఈ నెల ఐదో తేదీన నోటిఫికేషన్ జారీ కాగా, రాత పరీక్ష డిసెంబర్ 8న నిర్వహించనున్నారు. సెప్టెంబరు 6 ఆన్లైన్ దరఖాస్తుకు తుది గడువు. కాగా పరీక్ష ఫీజు చెల్లింపునకు సెప్టెంబరు 10 చివరి తేదీ. పరీక్ష రుసుమును ఆన్లైన్ దరఖాస్తులో ఇవ్వబడిన ఎస్బీఐ కలెక్ట్ లింక్ ద్వారా మాత్రమే చెల్లించాలి. పూర్తి వివరాలకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్లో లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాల్సి ఉంది.
● గతేడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10,233 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 9,830 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ ఏడాది దరఖాస్తుదారుల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారుల అంచనా.
విద్యార్థులకు
ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్లు
ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
జిల్లాల వారీగా గతేడాది వచ్చిన దరఖాస్తులు, పరీక్షకు హాజరైన వారి వివరాలు ఇలా..
జిల్లా దరఖాస్తులు పరీక్ష రాసినవారు
కాకినాడ 4170 3974
కోనసీమ 3121 3051
తూర్పుగోదావరి 2,942 2,805