breaking news
Yasuko
-
ప్రపంచంలోనే సీనియర్ ఆఫీస్ మేనేజర్
ఈ మే 15 కి యసూకో తమాకీ 91 లోకి ప్రవేశిస్తున్నారు. పుట్టిన రోజు అని ఆమె సెలవు పెడితే తప్ప, ఆరోజూ ఆమె ఆఫీస్కు వెళతారు. అయితే ఆ రోజు శనివారం వచ్చింది. తర్వాత ఆదివారం. పక్కపక్కన రెండు సెలవు రోజులు. ఒకవేళ ఆమె పుట్టిన రోజు ఆ రెండు రోజుల్లో కాకుండా తక్కిన ఐదు పని దినాల్లో ఏ రోజు వచ్చినా ఆమె సెలవు పెట్టి ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకుంటారని నమ్మకంగా అనుకోలేం. బహుశా ఆమె ఆఫీస్కు వెళ్లేందుకు మొగ్గుచూపడానికే అవకాశం ఎక్కువ! అరవై ఐదేళ్లుగా ఒకే కంపెనీలో పని చేస్తున్నారు యసూకో! అప్పట్నుంచీ ఆమె ఆఫీస్ మేనేజరే. అత్యవసరం అయితే తప్ప ఏ రోజూ సెలవు తీసుకోలేదు. వారానికి ఐదురోజులు, రోజుకు ఏడున్నర గంటలు షిఫ్టులో మిగతా సిబ్బందిలా పని చేస్తూనే వస్తున్నారు. ఈ తొంభై ఏళ్ల వయసులోనూ ఆమె అలసిపోలేదు. అలసట లేకుండా ఉండటానికి ఉద్యోగం ఆమెకు ఇష్టమైన వ్యాపకం కావచ్చు. ‘వరల్డ్ ఓల్డెస్ట్ ఆఫీస్ మేనేజర్’ అని ఏప్రిల్ 8న గిన్నెస్ ఆమెను కీర్తించింది. ఆమె చేతికి ‘రికార్డు’ పత్రాన్ని అందించింది. 1930లో జన్మించారు యసూకో. 1956లో ఒసాకాలోని ‘సన్కో ఇండస్ట్రీస్’ అనే ఒక ట్రేడింగ్ కంపెనీలో చేరారు. స్క్రూలను తయారు చేయడంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సన్కో.. మిగతా లోహపు మెటీరియల్స్ కూడా ఉత్పత్తి చేస్తుంటుంది. ఆ సంస్థలో అటుఇటుగా ఇరవై ఐదేళ్ల వయసులో ఆఫీస్ మేనేజర్ గా చేరారు. నాటి నుంచి అరవై ఐదేళ్లుగా అదే హోదాలో కొనసాగుతున్నారు. ఆఫీస్ అకౌంట్స్ చూడ్డం ఆమె ప్రధాన విధి. సిబ్బంది జీతాలు, బోనస్లు, పన్ను లెక్కలు అందులో భాగం. ఇప్పుడైతే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్తో లెక్కలన్నీ చక్కబెడుతున్నారు కానీ, మొదట్లో అన్నీ కాగితాల మీదే చకచకా! ఇప్పుడు ఫేస్బుక్, స్మార్ట్ఫోన్ కూడా ఉపయోగిస్తున్నారు. గిన్నిస్ గుర్తింపు పత్రంతో యసూకో తమాకీ, ‘సీనియర్’ ఆఫీస్ మేనేజర్ వయసు పెరుగుతున్న కొద్దీ ఒంట్లో ఓపిక తగ్గి పని మీద ఉత్సాహం నశించే అవకాశం ఉంది. అయితే యసూకో శక్తి ఆమె పనే! ‘‘పని చేస్తున్నంత సేపూ నాకు ఉత్సాహంగా ఉండటం మాత్రమే కాదు, కొత్త ఉత్సాహం ఏదో నాలో జమ అవుతుంటుంది’’ అని నవ్వుతూ అంటారు యసూకో. అందుకే ఆమె రిౖటెర్మైంట్ తీసుకోలేదు. వాళ్లూ ఇవ్వలేదు. సన్కోలోని మిగతా ఉద్దండ ఆఫీస్ మేనేజర్లంతా ఆమె ఇచ్చిన తర్ఫీదుతో ఉద్యోగంలో నిలబడినవారే! అకౌంట్స్కి కొత్తగా ఎవరైనా వచ్చి చేరారంటే.. మొదట ఆమె ఆశీర్వాదం తీసుకోవలసిందే. అప్పుడు ఆమె ఒకటే మాట చెబుతారు. ‘‘సంస్థ కోసం నమ్మకంగా పని చేయండి. సంస్థ మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోదు’’ అని. ఆ మాట ఆమె చెబితే ఎవరైనా వినకుండా ఉంటారా! గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్ను అందుకుంటున్నప్పుడు ఆమె తన ఆఫీస్ పట్ల కృతజ్ఞతను వ్యక్తం చూస్తూ.. ‘‘సంస్థ నా నుంచి ఏమైతే ఆశించిందో అదే చేస్తూ వచ్చాను. అదేమీ విశేషం కాదు కదా’’ అన్నారు. ‘‘ఇన్నేళ్లుగా మీరెలా చేయగలుగుతున్నారు’’ అని గిన్నెస్ ప్రతిధిని ఒకరు ఆమెను అడిగారు. ‘‘ఇతరులకు చేదోడుగా ఉండటం అనేది నా స్వభావం. ఆఫీస్లోనైతే చైర్మన్కి, ఇతర మేనేజర్లకు, సహోద్యోగులకు సహాయంగా ఉండటంలోని ఆనందమే నన్ను ఇన్నేళ్లుగా ఆఫీస్వైపు నడిపిస్తోందనే అనుకుంటున్నాను’’ అని సమాధానమిచ్చారు యసూకో. ‘‘నేనసలు రిటైర్మైంట్ ఉంటుందన్న ఆలోచననే ఏనాడూ తెచ్చుకోను. సంవత్సరం తర్వాత సంవత్సరం గడిచిపోతాయి. వాటితోపాటే నేనూ నడుస్తుంటాను. నన్ను నడిపిస్తున్నది నా ఆఫీస్’’ అని కూడా అన్నారు యసూకో. -
భార్యకు పూల వనాన్నే ఇచ్చాడు...
టోక్యో: పుట్టిన రోజునాడో, వాలెంటైన్ రోజునాడో ప్రపంచంలో ఏ భర్త అయినా పూల బొకే ఇచ్చి భార్యకు గ్రీటింగ్స్ చెబుతారు. జపాన్కు చెందిన ఓ భర్త మాత్రం తన భార్యకు పూల వనాన్నే సృష్టించి ఇచ్చారు. అందుకోసం దాదాపు దశాబ్దకాలం పాటు నిర్విరామంగా కృషి చేశారు. భార్యాభర్తల ప్రేమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేదని నిరూపిస్తున్నారు. మియాజకి ప్రాంతంలోని షింటోని పట్టణానికి చెందిన తోషియుకి, ఆయన భార్య యాసుకో డెయిరీ ఫారమ్ నిర్వహిస్తూ ప్రేమైక జీవనం సాగిస్తూ వస్తున్నారు. వారి పెళ్లైన 30వ ఏట మధుమేహం వ్యాధి వల్ల భార్య యాసుకోకు రెండు కళ్లు పోయి గుడ్డిదైంది. దాంతో ఆమె డిప్రెషన్లో కూరుకుపోయింది. అటు ఇద్దరు చిన్న పిల్లల ఆలనాపాలనా చూస్తూ, డెయిరీ ఫారమ్ నిర్వహిస్తూ భార్యను ఎలా చూసుకోవాలో, ఆమెను ఎలా ఊరడించాలో తెలియక తల్లడిల్లి పోయారు. ఇంటిబయట ల్యాండ్ స్కేప్లా ఉన్న స్థలంలో వేసిన కొద్దిపాటి షిబాజకురా (కార్పెట్లా పెరిగే గులాబీ పూలు) పూలను దారంటూ పోయేవారు ఆసక్తి చూడడం తోషియుకి గమనించారు. అంతే మనసులో ఓ ఆలోచన తళుక్కుమంది. ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలమంతా ఇదే పూలతో నింపేస్తే పర్యాటకులను ఆకర్షించవచ్చని, అలా వచ్చే వారితో మాటా ముచ్చట కలిపితే తన భార్య డిప్రెషన్ పోవచ్చని, ఒంటరితనం దూరమవుతుందని భావించారు. అంతే ఇక కార్యరంగంలోకి దిగారు. అప్పటికే తన వద్దనున్న 70 ఆవులను కొన్ని కొన్ని చొప్పున అమ్మేస్తూ వచ్చారు. అలా వచ్చిన సొమ్ముతో పూల వనాన్ని విస్తరిస్తూ వచ్చారు. అలా వనం విస్తరిస్తూ వచ్చింది. ఊహించినట్లుగానే వనం అందాలను తిలకించేందుకు, అక్కడ కాసేపు విశ్రమించేందుకు, గులాబీ పూల ల్యాండ్ స్కేప్ వద్ద ఫొటోలను దిగేందుకు పర్యాటకులు రావడం ప్రారంభించారు. అలా వచ్చిన వారందరూ భార్యతో మాట మంతి కలపడం, కుశల ప్రశ్నలు వేస్తుండడంతో భార్య డిప్రెషన్ పూర్తిగా ఎగిరిపోయింది. ఒంటరితనం దూరమైంది. తోసియుకి కూడా ద్విగుణీకృత ఉత్సాహంతో తోటను మరింద అందంగా తీర్చుదిద్దుతూ వస్తున్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో కూలివాళ్లను పెట్టుకోకుండా ఒంటరిగా శ్రమిస్తూ వస్తున్నారు. వారి పెళ్లై 60 వసంతాలు ఇటీవలనే పూర్తయ్యాయట. ముదిమి వయస్సులో కూడా తోషియుకి ఉత్సాహంగా ఎప్పటికప్పుడు కలుపు ఏరేయడం లాంటి పనులు చేస్తున్నారు. ఈ వయస్సులో కూడా భార్యాభర్తలు ఉల్లాసంగా జీవించడాన్ని చూసి పర్యాటకులు ముచ్చటపడుతున్నారు. ఖాళీ అయిన ఆవుల కొట్టాన్ని భార్యాభర్తలు తోట మధ్యన కాలక్రమంలో దిగిన ఫొటోలతో గ్యాలరీగా మార్చి వేశారు. వాటిని చూసిన పర్యాటకులు వారి మధ్యనున్న దాంపత్య సాన్నిహిత్యానికి అబ్బురపడుతున్నారు. ఏడాదికి కనీసంగా ఏడువేల మంది పర్యాటకులు ఆ తోటను సందర్శిస్తున్నారట. మార్చి, ఏప్రిల్ నెలల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుందట. ప్రవేశం కూడా ఉచితం.