breaking news
yaagam
-
సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక యాగాన్ని తలపెట్టారు. రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగంగా దీనికి నామకరణం చేశారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్హౌస్ వద్ద మూడు రోజులపాటు ఈ యాగం చేయనున్నారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో బుధవారం ఈ రాజశ్యామల యాగానికి అంకురార్పణ జరిగింది. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసమే కేసీఆర్ రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారని స్వరూపానందేంద్ర స్వామి చెప్పారు. ఈ యాగం మహా శక్తివంతమైనదని తెలిపారు. రాజులతో పాటు సామాన్యులను అనుగ్రహించే అమ్మవారు రాజశ్యామల అని పేర్కొన్నారు. మహాభారతం చదివిన జ్ఞాని, హైందవతత్వం పరిపూర్ణంగా తెలిసిన నేత సీఎం కేసీఆర్ అంటూ ప్రశంసలు కరిపించారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలనే ఈ యాగం చేపట్టారని తెలిపారు. కేసీఆర్ కుటుంబానికి రాజశ్యామల అనుగ్రహం ఉండాలని ఆశీస్సులు అందించారు. చదవండి: బీజేపీకి గడ్డం వివేక్ రాజీనామా.. కాంగ్రెస్లో చేరిక తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన పండితుల ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఈ యాగం జరుగుతుంది. గోపూజ అనంతరం కేసీఆర్ దంపతులు యాగశాల ప్రవేశం చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసనతో యాగానికి అంకురార్పణ జరిగింది. కేసీఆర్ దంపతులతో స్వరూపానందేంద్ర స్వామి యాగ సంకల్పం చెప్పించారు. విశాఖ శ్రీ శారదాపీఠ అధిష్టాన దైవం రాజశ్యామల అమ్మవారికి స్వరూపానందేంద్ర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశ్యామల అమ్మవారిని వనదుర్గ అవతారంలో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాగం నిర్విఘ్నంగా కొనసాగాలని ముక్కోటి దేవతలను ప్రార్ధిస్తూ అస్త్ర రాజార్చన, కర్కరీయ స్థాపన నిర్వహించారు. యాగంలో పాల్గొనే పండితులు, రుత్విక్కులకు కేసీఆర్ దంపతులు దీక్షా వస్త్రాలను స్వయంగా అందించారు. అఖండ స్థాపన అనంతరం అగ్నిమధనం చేసి యాగశాలలో అగ్నిని ప్రతిష్టించారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ యాగంలో రెండోరోజు వేదపారాయణలు, హోమం తదితర క్రతువులు నిర్వహిస్తారు. చివరిరోజు పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. తెలుగు రాష్ట్రాలు సర్వతోముఖాభివృద్ధి చెందాలని, సస్యశ్యామలంగా కళకళలాడాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యాగాన్ని తలపెట్టారని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. రాజశ్యామల యాగం విశాఖ శ్రీ శారదాపీఠానికి ప్రత్యేకమని చెప్పారు. యాగంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్, ఎంపీ నామా నాగేశ్వర్ రావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి వేణుగోపాల చారి, ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
మహావిష్ణుయాగం
సకల విశ్వశాంతి, సర్వమానవాళి మధ్యన సుహృద్భావన, పరస్పర సహకారం, మతసామరస్యంతో సహజీవనం, పర్యావరణ పరిరక్షణ, పాడి–పంటలు; సకాల వృష్ఠి, వసంతాది సకాల–సక్రమ ఋతు ప్రవేశాలు, భూకంపాలు–వరదలు–తుఫానులు–అతివృష్ఠి–అనావృష్ఠి–విషజ్వరాలు–అంటువ్యాధులు, మానవుల ఆటవిక ప్రవత్తి ఇత్యాదుల నివారణ కోసం మరికొన్నివేల సంవత్సరాలు ఈ జగత్తంతా శాంతిమయంగా కొనసాగాలనే లక్ష్యంతో జూన్ 28న యాదగిరిగుట్ట (యాదాద్రి)లో మహాక్రతువులు ఆరంభమయ్యాయి. జగత్ పరిరక్షకుడూ, సకల జీవరాశి పరిపోషకుడు శ్రీమహావిష్ణువు. అయనే జగత్కారకుడని సకల వేద–శాస్త్ర–ఇతిహాస–పురాణాదులు, ఉపనిషత్తులు నొక్కి వక్కాణిస్తున్నాయి. మంత్రపుష్పంలో ‘విశ్వం నారాయణం హరిం’ అనీ, యజ్ఞమంటేనే విష్ణువనీ... ఇలా అనేక విధాలుగా శ్రీమహావిష్ణువును గూర్చి వచించారు. స్థితికారకుడైన విష్ణుమూర్తి పేరిట ఏదైనా బృహత్కార్యం తలపెడితే, విశ్వశాంతి కలుగుతుందనే ఉద్దేశ్యంతో తలపెట్టిందే ఈ మహావిష్ణు యాగం. ఈ మహాయజ్ఞం శ్రీమహావిష్ణువు యోగనిద్రావస్తలో నుండే ఆషాఢమాసం నుండి పరమపవిత్రం, శివ–కేశవ ప్రీతికరమూ అయిన కార్తీక మాసం వరకూ గల చాతుర్మాస కాలంలో ‘అయుత శ్రీమహావిష్ణు మహాయాగం’ నిర్వహిస్తున్నారు. ఈ మహాక్రతువులను మూడు విభాగాలు చేసి ప్రథమ ఘట్టంలో పంచ నారసింహ క్షేత్రమైన యాదాద్రిలో ఐదు రోజులు నారసింహ ఉపాసన జరిగింది. ద్వితీయ ఘట్టంలో 108 రోజులు 12 మంది ఋత్విజులచే నిత్యం 1,00,800 చొప్పున 108 రోజులలో ఒకకోటి ఎనిమిది లక్షలసార్లు శ్రీ నారాయణాష్టాక్షరీ జపం జరుగుతోంది. ఈ 108 రోజులలో తొలి ఏకాదశి తిథి నుండి 8 ఏకాదశి పర్వదినాలలో అహోరాత్రముగా (24 గంటలు) విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, నామ సంకీర్తన, భక్తి కీర్తనలు, భక్తిపాటలు, భజనాదులు, గురుపూర్ణిమాదిగా వచ్చే ప్రతి పర్వదినాన విశేష కార్యక్రమాలు, హోమాలు నిర్వహిస్తారు. తృతీయ ఘట్టంలో 12 రోజులలో... ద్వితీయఘట్టంలో 108 రోజులపాటు నిర్వహించిన 1,08,00,000, నారాయణాక్షరీ జప దశాంశమైన 10,80,000 నారాయణాష్టాక్షరీ హోమాలు చేస్తారు. ‘అయుత’ అనేదానికి అర్థం ‘దశసహస్రం’ (పదివేలు). అటువంటి 10,000 పురుష సూక్త పూర్తి పాఠంతో నిర్వహింపబడే హోమాలు. కాబట్టి దీనికి అయుత అని పేరు. ఆవిధంగా పదివేల పురుషసూక్త హోమాలు నిర్వహించినప్పుడు దానికి పదిరెట్లు అనగా నియుత (ఒక లక్ష) పారాయణలు జరగాలి. ఇక మహావిష్ణువుకు హోమాలు నిర్వహిస్తున్నప్పుడు ఆయన వక్షస్థల నివాసిని అమ్మవారిని గూడా సేవించుకొని తృప్తి పర్చాలిగదా. అందుకనే ఈ మహాక్రతువులలో శ్రీమహాలక్ష్మికి ప్రీతికరంగా పదివేల ఎనిమిది వందలు (అయుత) శ్రీసూక్త పారాయణలు; దశాంశమైన 1,080 శ్రీసూక్త హోమాలు; భూదేవికి ప్రీతికరంగా 1,080 భూసూక్త పారాయణలు, 108 భూసూక్త హోమాలూ, నిత్యం స్వామివారికి–అమ్మవారికీ అభిషేక–అర్చన–అలంకరణాదులతోబాటు స్తోత్ర పారాయణలు, నామసంకీర్తనలు, పంచాయతన దేవతలైన గణపతికి అభిషేకం, అర్చన, అలంకారం, శీర్షోపనిషత్, చతురావృత తర్పణాలు, గణపతి హోమం, ఆదిత్యునికి (సూర్యునికి) మనకు ప్రత్యక్షదైవమూ, ఆరోగ్యమూ (ఆరోగ్యం భాస్కరాదిచేత్‘) పాడిపంటలూ, ఋతుక్రమ పాలన ఇత్యాదులకు మూలమైన ప్రత్యక్ష నారాయణునకు ప్రీతికరంగా సూర్యనమస్కారాలు, అభిషేకం, మహాసౌర–అరుణ పారాయణలూ, అరుణ–సౌర హోమములు, రుద్ర(శివ) ప్రీతికరంగా నిత్యం 121 నమక–చమక పారాయణలతో కూడిన లఘు రుద్రాభిషేకంతో 11 రోజులలో మహారుద్రాభిషేకం, త్రిచార్చన–రుద్ర క్రమార్చన, రుద్రహోమం; దేవీ ప్రీతికరంగా ప్రతినిత్యం పూర్ణదీక్షాపరులు–ఉపాసకులైన ఋత్విజులతో శ్రీచక్ర నవావరణార్చన– చండీ పారాయణలు, హోమాలు, భక్తుల అభీష్టానుసారంగా జరిగే అనేక విశేషహోమాలు, చతుర్వేద పారాయణలు, పూర్తి వైదిక కార్యక్రమం కనుక ప్రవచనాలూ తదితర కార్యక్రమాల సమాహారంగా ఈ మహాక్రతువులు సకల విశ్వశాంతి, ప్రాణికోటి మరికొన్ని శతాబ్దాలపాటు సుఖజీవనం సలపాలని ఈ ‘శ్రీ పంచాయతన సహిత అయుత శ్రీ మహావిష్ణు యాగాలు’ ‘శ్రీవైకుంఠనారాయణ మహాసుదర్శన యంత్ర ప్రస్తార యాగశాల – హోమకుండాలలో’ నిర్వహిస్తున్నారు. జాతి–మత–కుల–వర్ణ–వర్గ భేదాలు లేకుండా దేశ–విదేశాలలో నున్న ప్రతి ఒక్కరూ సందర్శించవచ్చుననీ, ప్రతినిత్యం సుమారు 50,000 నుండి–60,000 వరకు అన్న సమారాధన – యాగ పరిసమాపన దివసమైన కార్తీక శుక్ల ద్వాదశీ పర్వదినాన అనగా ది.01.11.2017 బుధవారం అర్చనాదులు, మహాశాంతి హోమం, పూర్ణాహుతి, అవబృధం, వేదోక్త మహదాశీర్వచనం తరువాత సుమారు లక్షా 50 వేలనుండి 2 లక్షలమంది వరకు మహాన్నసమారాధనా విశేషంగా చెప్పవలసిన అంశాలు. యాగ విశేషాలు లోకకల్యాణం, కుటుంబ సౌఖ్యం, ఆర్థిక ఇబ్బందుల నిర్మూలన, ప్రకృతి విపత్తుల నిర్మూలన, దేశ సంక్షేమం తదితరాలు... యాగకర్తలు: కేసాప్రగడ హరిహరనాథ శర్మ, రాధాకృష్ణకుమారి దంపతులు నిర్వాహకులు: కేపీ రాజశేఖర శర్మ ఎప్పటినుంచి ఎప్పటివరకు? అక్టోబర్ 20 నుంచి నవంబర్ 1 వరకు సుమారు 350 మంది రుత్విక్కులు, వేద పండితులు, యాగ యాజ్ఞికులు వస్తున్నారు. నిర్వహణ చూసుకునేందుకు మరో 100 మంది యాగ నిర్వాహకులు పాల్గొంటున్నారు. హాజరు కానున్న ప్రముఖులు: శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామి, ఉత్తరాధికారి విధుశేఖర భారతి, చిన్న జీయర్స్వామి, దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి, తోగుట్ట మాధవానంద స్వామిలతోబాటు ప్రవచనకర్తలు సామవేదం షణ్ముఖ శర్మ, మైలవరపు శ్రీనివాస రావు, కందాడై రామానుజాచార్యులు తదితర పండితులు. – ఆరుట్ల వేణుగోపాలాచార్యులు, సాక్షి, యాదాద్రి -
2018లో అశ్వమేధ యాగం
రాజమహేంద్రవరం కల్చరల్ : ఐదు లక్షల మంది భక్తులతో 2018 నవంబరులో రాజమహేంద్రవరంలో అశ్వమేధ యాగాన్ని నిర్వహించనున్నట్టు అఖిల్ విశ్వగాయత్రి పరివార్, శాంతికుంజ్, హరిద్వార్ ప్రతినిధి బ్రిజ్మోహన్ గౌడ్ తెలిపారు. శనివారం స్థానిక ఆనం రోటరీహాల్లో అఖిల విశ్వగాయత్రి పరివార్ నగర శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడేళ్లకోసారి అశ్వమేధ యాగాన్ని నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు కన్యాకుమారి,హరిద్వార్లో నిర్వహించామని పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లడానికి ఈ యాగాన్ని నిర్వహిస్తున్నామని చె´పు. సమావేశంలో నగర కన్వీనర్ జగదీష్ వైష్ణవ్, దక్షిణ భారత కన్వీనర్ సుబ్బారావు, గాయత్రీ ప్రజ్ఞా పీఠాధిపతి ద్రాక్షారపు రాధాకృష్ణమూర్తి, సీతారామ్ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.