breaking news
Volleyball Champion
-
అదర గొట్టిన సిక్కోలు సిన్నోడు..
శ్రీకాకుళం న్యూకాలనీ: పలాస మండలం అంతరకుడ్డ గ్రామానికి చెందిన వాలీబాల్ కుర్రాడు అట్టాడ చరణ్ అదరగొట్టాడు. అంతర్జాతీయ పోటీల్లో ప్రాతినిధ్యం వహించిన మొదటి టోర్నీలోనే జట్టు విజయంలో కీలకపాత్ర పోషించి కాంస్య పతకం సాధించి శభాష్ అనిపించాడు. ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు థాయిలాండ్ వేదికగా ప్రతిష్టాత్మక 2వ ఏషియన్ అండర్ –16(మెన్) వాలీబాల్ చాంపియన్షిప్ –2025 పోటీలు జరిగాయి. ఇందులో త్రుటిలో ఫైనల్ బెర్త్ను కోల్పోయిన భారత జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించిన సిక్కోలు క్రీడాతేజం చరణ్ కాంస్య పతకం సాధించాడు. జట్టు విజయంలో కీలకభూమిక వహించిన చరణ్ ప్రతిభను జట్టు యాజమాన్యం, ఇండియన్ వాలీబాల్ ఫెడరేషన్ ప్రసంశించింది. అంతకుముందు ఈ నెల 10వ తేదీ వరకు బెంగళూరు వేదికగా ఎన్.ఎస్.ఎస్.సి. అకాడమీలో జరిగిన శిక్షణా శిబిరాల్లో మంచి క్రమశిక్షణతోపాటు అత్యుత్తమ ఆటతీరుతో సెలక్టర్లను ఆకట్టుకున్నాడు.అంతరకుడ్డ నుంచి అంతర్జాతీయ పోటీలకు..చరణ్ తల్లిదండ్రులు అట్టాడ కమల్నాదమ్, దేవి. వీరిది వ్యవసాయ కుటుంబం. చరణ్ విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో ఉన్న సాయ్ స్పోర్ట్స్ స్కూల్/హాస్టల్లో ఉంటూ పదో తరగతి పూర్తిచేశాడు. ఇంటర్మీడియెట్లో ప్రవేశం పొందనున్నాడు. అన్నయ్య భార్గవ్ ఇంజనీరింగ్ ఫస్టియర్ చదువుతున్నాడు. మావయ్య రవి ప్రేరణ.. కోచ్ సత్యనారాయణ ప్రోత్సాహంతో రాణించగలుగుతున్నానని చెబుతున్నాడు. 2025లో ఢిల్లీలో జరిగిన సీబీఎస్సీ నేషనల్స్ వాలీబాల్ స్కూల్గేమ్స్లో కాంస్య పతకం సాధించగా, గత ఏడాది 2024లో జార్ఖండ్లో జరిగిన సీబీఎస్సీ నేషనల్స్లో ప్రాతినిధ్యం వహించి సత్తాచాటాడు.అభినందనల వెల్లువ..సిక్కోలు నుంచి ఏషియన్ వాలీబాల్ పోటీలకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా కాంస్య పతకం సాధించడం పట్ల క్రీడావర్గాల్లో సర్వాత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.వాలీబాల్ జిల్లా కార్యదర్శి కె.రామచంద్రుడు, ఉపాధ్యాక్షులు వై.పోలినాయుడు, కార్యనిర్వాహక కార్యదర్శి ఎన్వీ రమణ, టి.రవి, సలహాదారు పి.సుందరరావు, పీఈటీ సంఘ నాయకులు ఎంవీ రమణ, ఎం.సాంబమూర్తి, బి.సతీష్, డీఎస్డీఓ డాక్టర్ కె.శ్రీధర్రావు, కోచ్ కె.హరికృష్ణ, వాలీబాల్ సంఘ ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.సంతోషంగా ఉంది..అంతర్జాతీయ ఏషియన్ వాలీబాల్ మీట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా ఉంది. అందులోను మెడల్ సాధించడం సంతోషంగా ఉంది. సీనియర్ నేషనల్స్ ఆడి దేశానికి రిప్రజెంట్ చేయాలనేది నా కళ. ఇందుకు అహర్నిశలు కృషి చేస్తా.– అట్టాడ చరణ్, వాలీబాల్ క్రీడాకారుడు -
వాలీబాల్ చాంపియన్ నిజామాబాద్
నిజామాబాద్స్పోర్ట్స్ : రాష్ట్రస్థాయి అండర్-19 వాలీబాల్ పోటీల్లో నిజామాబాద్ బాలబాలికలు సత్తా చాటారు. సొంతగడ్డపై జరిగిన టోర్నమెంట్లో చాంపియన్గా నిలిచారు. అద్భుతమైన ఆటతీరుతో ప్రత్యర్థులను మట్టికరిపించి జయకేతనం ఎగురవేశారు. జిల్లాకేంద్రంలోని కలెక్టర్ గ్రౌండ్లో జరిగిన రాష్ట్రస్థాయి టోర్నీ శుక్రవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలంటే ప్రతిఒక్కరికీ ఇష్టమేనన్నారు. జీవితాంతం ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పాడుతాయన్నారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్లో నిజామాబాద్ బాలబాలికల జట్లు ప్రథమ స్థానంలో నిలువడం జిల్లా గర్వకారణమన్నారు. ఆటల్లో గెలుపు, ఓటములు సహజంగా ఉంటాయని, ఓడినవారు విజయం కోసం మరింత కృషిచేయాలని సూఇంచారు. తాను చిన్నప్పుడు ఆటలకు దూరమయ్యానని చదువుతోనే బాల్యం గడిచిపోయిందన్నారు. ఇప్పుడు మాత్రం ప్రతీరోజు టెన్నిస్ ఆడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నానన్నారు. పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు జాతీయస్థాయి టోర్నమెంట్లో తెలంగాణను ప్రథమ స్థానంలో నిలుపాలన్నారు. అనంతరం క్రీడల నిర్వహణ కార్యదర్శి సాయిలు, డీవీఈవో ఒడ్డెన్న, ఆర్ఐవో విజయ్కుమార్లు మాట్లాడుతూ అండర్-19 రాష్ట్రస్థాయి టోర్నమెంట్ను విజయవంతం చేసినందుకు క్రీడాకారులకు, క్రీడాభిమానులకు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. జాతీయస్థాయి టోర్నమెంట్ మహారాష్ట్రలోని కోలాపూర్లో త్వరలో జరుగుతుందని, అక్కడ మన రాష్ట్ర జట్టును ప్రథమ స్థానంలో నిలుపాలన్నారు. టోర్నమెంట్ నిర్వహణకు సహకరించిన జయ హాస్పిటల్ డాక్టర్ ప్రేమానందం, ఎంఎస్ఆర్ స్కూల్ డెరైక్టర్ విక్రమ్రెడ్డి, ఎన్వైకే కో-ఆర్డినేటర్ రాంచందర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విజేతలకు మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్రెడ్డి, డీఎస్డీవో శర్మ, ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి గంగాధర్, పీడీలు మన్నన్, మల్లేశ్గౌడ్, శ్రీధర్, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.