breaking news
visakha steels
-
‘విశాఖ ఉక్కు’ ఆస్తుల విక్రయంపై అభ్యంతరం ఉందా?
సాక్షి, అమరావతి: కర్మాగార ఆర్థిక అవసరాల నిమిత్తం తమ సొంత ఆస్తులను విక్రయించుకునే హక్కు తమకుందని, గతంలో ఇచ్చిన స్టేటస్కో ఉత్తర్వులవల్ల తమ ఆస్తుల విక్రయ ప్రక్రియ నిలిచిపోయిందని, అందువల్ల ఆ ఉత్తర్వులను సవరించాలంటూ విశాఖ ఉక్కు యాజమాన్యం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై అభ్యంతరం ఉన్న పిటిషనర్లు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కౌంటర్లు శుక్రవారం కల్లా దాఖలు చేయాలని స్పష్టంచేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ జగడం సుమతి ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.ప్రైవేటీకరణపై వ్యాజ్యాలు..విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్తో పాటు సువర్ణరాజు అనే వ్యక్తి కూడా వేర్వేరుగా పిల్లు దాఖలు చేశారు. అలాగే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, రేషన్ కార్డుదారులకు ఉద్యోగాలిస్తామన్న గత హామీ మేరకు ఉద్యోగాలిచ్చేలా ఆదేశాలివ్వాలంటూ కూడా పలువురు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై జస్టిస్ దుర్గాప్రసాదరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతూ వస్తోంది. గతవారం ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా, విశాఖ యాజమాన్యం తరఫు సీనియర్ న్యాయవాది డబ్ల్యూబీ శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం తాము సొంతగా ఏపీఐఐసీ, హౌసింగ్ బోర్డు నుంచి భూములు కొన్నామని, ఇలా తాము కొనుగోలు చేసిన 24.99 ఎకరాల భూమినే అమ్ముకుంటున్నామని తెలిపారు. అయితే, హైకోర్టు ఇచ్చిన స్టేటస్కో ఉత్తర్వులవల్ల భూముల విక్రయం ఆగిపోయిందన్నారు. అందువల్ల ఈ ఉత్తర్వులను సవరించాలని కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. యాజమాన్యం స్వీయ ఆస్తుల విక్రయంపై అభ్యంతరం ఉన్న పిటిషనర్లను కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులతో రూ.243 కోట్లు నిలిచిపోయాయి..తాజాగా.. ఈ వ్యాజ్యాలు మంగళవారం మరోసారి విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది డబ్ల్యూబీ శ్రీనివాస్ తమ అనుబంధ పిటిషన్ గురించి ప్రస్తావించారు. అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్తుల విక్రయాల ద్వారా రూ.243 కోట్లు రావాల్సి ఉందని.. స్టేటస్కో ఉత్తర్వులవల్ల ఆ డబ్బు నిలిచిపోయిందన్నారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ.. కౌంటర్లు వేయని వాళ్లు శుక్రవారంకల్లా దాఖలు చేయాలని మరోసారి ఆదేశించి తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు : కేఏ పాల్తనను కోర్టులోకి, కోర్టు హాలులోకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని.. కొత్త ప్రభుత్వం వచ్చాకే ఇలా చేస్తున్నారని కేఏ పాల్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తే తనను అడ్డుకుంటున్న విషయం తెలుస్తుందన్నారు. దీంతో ధర్మాసనం ఒకింత తీవ్రంగా స్పందిస్తూ, ఎవరా పోలీసులు అంటూ ఆరా తీసి, అలా అయితే పోలీసులపై హైకోర్టు రిజిస్ట్రార్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని పాల్కు న్యాయస్థానం సూచించింది. తాము కూడా చర్యలకు ఆదేశాలిస్తామని చెప్పింది. ఒకవేళ మీరు చెబుతున్నది అబద్ధమని తేలితే చర్యలకు సిద్ధంగా ఉండాలని పాల్కు ధర్మాసనం తేల్చిచెప్పింది. -
యధాతథంగానే విశాఖ ఉక్కు డిజిన్వెస్ట్మెంట్
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు (ఆర్ఐఎన్ఎల్)లో పెట్టుబడుల ఉపసంహరణ యథాతథంగా కొనసాగుతుందని కేంద్ర ఉక్కు శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పురోగతిలోనే ఉందని తెలిపింది. పనితీరును మెరుగుపర్చుకునేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోందని శుక్రవారం ఒక ప్రకటనలో వివరించింది. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రస్తుతానికి నిలిపివేస్తోందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర ఉక్కు శాఖ ఈ మేరకు వివరణ ఇచ్చింది. వైజాగ్ స్టీల్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 7 మిలియన్ టన్నులు. కంపెనీలో ప్రభుత్వానికి ఉన్న 100 శాతం వాటాలను విక్రయించే ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) 2021 జనవరి 27న ఆమోదముద్ర వేసింది. -
విశాఖ స్టీల్స్కు గనులు కేటాయించండి
న్యూఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్కు ఇనుప ఖనిజం కోసం సొంత గనులను కేటాయించాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కోరారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కు మిగిలిన ఏకైక అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ స్టీల్స్కు సొంత గనులు లేకపోవడంతో 2015-16 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.1,421 కోట్ల నష్టాలను చవిచూసిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో సొంత గనులు ఉన్న స్టీల్ సంస్థలకు రూ.500లకే టన్ను ముడి సరుకు దొరుకుతుంటే విశాఖ స్టీల్స్కు మాత్రం టన్నుకు రూ.4500 ఖర్చు అవుతోందని తెలిపారు. మార్కెట్లో నిలబడాలంటే ఉత్పత్తులను మాత్రం మిగతా సంస్థలకు సమానంగా అమ్మాల్సి రావడంతో భారీ నష్టాల ఊబిలో కూరుకుపోయిందని తెలిపారు. ఇటువంటి పరిస్థతిల్లో సంస్థను కాపాడుకోవాలంటే తక్షణమే విశాఖ స్టీల్స్కు సొతం ఇనుప ఖనిజం గనులను కేటాయించాలని ప్రధానిని కోరారు. ఈ విషయంలో ఆలస్యం జరిగితే అది సంస్థ మనుగడకే ప్రమాదమని, సొంత గనులను కేటాయిస్తూ తక్షణమే గనుల మంత్రిత్వ శాఖను ఆదేశించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.